కరీంనగర్ : కరీంనగర్ లో నిర్మిస్తున్న ఇంటిగ్రెటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఆధునిక హంగులతో అత్యద్భుతంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులను ఆదేశించారు.గురువారం కరీంనగర్ పర్యటనకు వచ్చిన ఆమె ప్రస్తుత కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న (ఐడీఓసి) ఇంటిగ్రెటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఆమె మాట్లాడుతూ కార్యాలయ భవనాన్ని ఓ ప్రభుత్వ కార్యాలయంగా కాకుండా కార్పోరేట్ ఆఫీస్ గా తీర్చిదిద్దాలని సూచించారు. 100 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేపట్టాలని, దానితో పాటు జిల్లా కలెక్టర్ల క్యాంపు కార్యాలయ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని తెలిపారు. నిర్మాణా పనులన్ని వేగవంతంగా పూర్తిచేసుకొని రానున్న ఆగస్టు నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడానికి సిద్ధం చేయాలన్నారు.
ఐడీఓసీ, క్యాంపు కార్యాలయాల నిర్మాణాలలో అదనపు నిధుల అవసరం ఉంటే ప్రతిపాదనలను తనకు పంపించాలన్నారు. కలక్టరేట్ వద్ద మురుగు కాలువ వలన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వివరించారు. స్మార్ట్ సిటీ పనులతో మరింత అందంగా తీర్చిదిద్దాలని తెలిపారు. అంతకు ముందు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఫొటో ప్రజంటేషన్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జడ్పీ సీఈవో ప్రియాంక, ట్రైని కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, ఇరిగేషన్ అధికారులు, గుత్తేదారు పాల్గొన్నారు.