కరీంనగర్ కార్పొరేషన్/సిరిసిల్లటౌన్/కామారెడ్డి, ఆగస్టు 7: వైద్య కళాశాలల మంజూరుపై ఆయా జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వైద్యకళాశాలల మంజూరుపై టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఏండ్లనాటి కల నెరవేరనుండటంతో సంబురాల్లో మునిగితేలారు.
కరీంనగర్లో ఆదివారం టీఆర్ఎస్ మైనార్టీ సెల్ నాయకులు స్వీట్లు పంచిపెట్టారు. రాజన్న సిరిసిల్ల కేంద్రంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తావద్ద పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు అందుకు చొరవ చూపిన మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు పరిపాలనాపరమైన అనుమతులతోపాటు ప్రభుత్వ దవాఖానను అప్గ్రేడ్ చేయడంతో జిల్లాలోని పలుచోట్ల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు జరుపుకొన్నారు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, దోమకోండ, భిక్కనూర్, బీబీపేట, సదాశివనగర్, రామారెడ్డి, కామారెడ్డి, ఎల్లారెడ్డి మండల కేంద్రాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కామారెడ్డి ప్రజల ఆకాంక్ష మేరకు వైద్య కళాశాలను మంజూరు చేయడంతోపాటు పరిపాలనా అనుమతులు ఇవ్వడం హర్షణీమన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నాయకులు నృత్యాలు చేస్తూ, మహిళలు బతుకమ్మ ఆడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.