హైదరాబాద్: కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు కన్నుమూశారు. 87 ఏండ్ల ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
జగపతిరావు 1935లో జన్మించారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన మొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తర్వాత 1978లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. కాగా, 1989లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. కొంతకాలంపాటు తెలంగాణ లెజిస్లేచర్ ఫోరం కన్వీనర్గా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. కాగా, జగపతిరావు మృతి పట్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం తెలిపారు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడని, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నారని చెప్పారు.