Paddy Procurement | కరీంనగర్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మొన్నటిదాకా నీళ్లు లేక పంటలు ఎండితే.. అరకొరగా వచ్చిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. ఓ వైపు అకాల వానలు భయపెడుతుండగా.. ధాన్యం రైతు దైన్యస్థితిని ఎదుర్కోవాల్సి వస్తున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు భారీగా ప్రారంభించామని కాగితాలపై లెక్కలు చూపుతున్నా.. వాస్తవ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉన్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో కలిపి ఈ సీజన్లో 1,331 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఈనెల 8 నాటికే 1,283 కేంద్రాలు ప్రారంభించినట్టుగా ప్రకటించారు. ఇందులో జగిత్యాల జిల్లాలో 418, కరీంనగర్లో 341, రాజన్నసిరిసిల్ల జిల్లాలో 259, పెద్దపల్లి జిల్లాలో 313 కేంద్రాలు ప్రారంభమైనట్టు అధికార యంత్రాగం చెబుతున్నది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉన్నది. నేటికీ 50శాతం కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన చోట తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొన్నిచోట్ల ధాన్యం ఎండబెట్టినప్పటికీ.. వెంటనే కొనుగోలు చేయకపోవడంతో ఇటీవల కురిసిన జల్లులతో మళ్లీ తడిసింది. దీంతో రైతులు మళ్లీ ఆరబోయాల్సిన దుస్థితి ఏర్పడింది.
కేంద్రాల్లో ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో అన్నదాతలు చేతికొచ్చిన ధాన్యాన్ని తెగనమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు, పలువురు రైస్మిల్లర్లు క్వింటాల్కు రూ.1800 చొప్పునే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫైన్ రకాలకు క్వింటాలుకు రూ.2,203, సాధారణ రకాలకు రూ.2,183 మద్దతు ధర ఉంది. ఈ లెక్కన క్వింటాల్పై రూ.400 వరకు రైతులు నష్టపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం క్వింటాల్కు రూ. 500 బోనస్ ఇస్తామని చేతులెత్తింది. ఒక వేళ ఇచ్చినా వ్యాపారులకు విక్రయించిన రైతులకు బోనస్ వర్తించదు. కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నా మంత్రులెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోగా.. అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు.
గొల్లపల్లి మార్కెట్లో రైతుల దయనీయ పరిస్థితి
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని 18 రోజుల కింద ప్రారంభించారు. రైతులు భారీగా యార్డుకు ధాన్యం తెచ్చారు. కానీ నేటి వరకు ఒక్క కిలో ధాన్యం కొనలేదు. మాయిశ్చర్ పేరుతో కొనకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజుల కిందట వచ్చిన మబ్బులకు మార్కెట్లో పోసిన ధాన్యం కాపాడుకునేందుకు నానా పాట్లుపడ్డారు.
ఈ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లను గొల్లపల్లి సహకార సంఘం చేస్తుంది. ఇంకా గన్నీ సంచులు కూడా రాలేదు. కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు మిల్లు అలాట్మెంట్ కూడా జరుగలేదు. జిల్లా అధికారులు స్పందించి మార్కెట్లో పేరుకుపోయిన ధాన్యాన్ని త్వరగా కొనుగోలు జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. ఇక్కడకు వచ్చిన ధాన్యంలో 80 శాతం ధాన్యం మిల్లర్లే కొనుగోలు చేస్తున్నారు. మొదట క్వింటాల్కు రూ.1800 పెట్టిన మిల్లర్లు, ఇప్పుడు రూ.1700 మాత్రమే ఇస్తున్నారు. లేదంటే ‘మీ ఇష్టం’ అంటూ రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని అందినంత దండుకుంటున్నారు.
నాలుగెకరాలు కౌలుకు తీసుకున్నం. ఉగాదికి వారం రోజుల ముందుగాల్నే సెంటర్కు తెచ్చి వడ్లు ఎండబోసినం. మాయిశ్చర్ లేదని సార్లు గోసపుచ్చుకుంటుండ్రు. పొద్దుగాలత్తే పొద్ద్దుగూకే దాక వడ్లను ఎండబోసుకుంటున్నం. తెల్లందాక కావలి లేకపోవడంతో వడ్లను ఎత్తుకు పోయేటోడు ఎత్తుక పోతడు. ఇగ వానొత్తే ఆ దేవుడికే మొక్కాలే. యాభై మంది రైతులం ఎండబోత్తే ఇద్దరియి జోకిండ్రు. మాలైనొచ్చే సరికి ఇంకెన్ని రోజులైతదో.
– గంగుల ఎల్లయ్య, సత్తవ్వ పెద్దూరు (సిరిసిల్ల)
మార్కెట్ స్టార్టు అయిందని వడ్లు తెచ్చినం. వచ్చిన వడ్లు వచ్చినట్టే ఉంటున్నయి. ఏమైంది సార్ అంటే.. పట్టించుకునేటోడు లేడు. మూడు దినాలుగా మూడు నాలుగు సార్లు వాన జల్లులు పడ్డయి. మార్కెట్కు తెచ్చిన ధాన్యం తడువకుండా కుప్పలపై టార్ఫాలిన్లు కప్పుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నం. ఎండినప్పుడు కొనకపోయే సరికి.. వర్షానికి మళ్లీ తేమ శాతం పెరిగింది. అంతా అధికారుల కండ్ల ముందే జరుగుతున్నా ఏమాత్రం దయ జూపడం లేదు.
– లక్కాకుల శ్రీనివాస్, రైతు (గొల్లపల్లి)
నలుగురు రైతులం కలిసి పదిరోజుల కింద పెద్దూరు సెంటర్కు వడ్లు తెచ్చి ఎండబోత్తున్నం. రోకళ్లు పగిలేట్టు కొడుతున్న ఎండకు వడ్లు మంచిగెండినయ్. నోట్లేసుకుంటే పళ్లు మంటున్నయ్. తాళ్లులేవు. బెడ్డలు లేవు. సూద్దామన్నా రాళ్లు లేవు. గింత మంది రైతులు ఎండబెట్టిన వడ్లను 15 రోజులయితన్నా ఇద్దరుముగ్గురియే కొన్నరు. గిదేంది సారని అడిగితే వడ్లు ఎండలేదంటున్నరు.
– గొడుగు ఎల్లయ్య, పెద్దూరు (సిరిసిల్ల అర్బన్ మండలం)
సెంటర్లకు వడ్లు తెచ్చి ఇరవై రోజులైతంది. ఎండ సుర్రుమంటుంది. ఇప్పటి వరకు కాంటా పెట్టలేదు. ఇంకెన్ని రోజులుండాలని అడిగితే నీలైన్ రావద్దా? అన్ని గద్దించి పెడతండ్రు. వడగళ్ల వానొత్తే ఎండిన వడ్లు నానితే మళ్ల మొదటికొత్తదని తెల్లందాక పొద్దుందాక ఈడ్నే సత్తున్నం. ఎండి ఎండి గలగల మంటున్నా గింజలను కొనేదిక్కులేదు. మిల్లులకు తీసుకుపోతే ఏలొల్లీ ఉండదు. మా రైతుల గోస ఎవనికి పట్టదాయే.
– ఆయిలు పర్శరాములు, సిరిసిల్ల