Karimnagar Robbery | కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ షాపులో దోపిడీ కేసు వివరాలను కరీంనగర్ సీపీ గౌస్ ఆలం మీడియాకు వెల్లడించారు. ఐదుగురు తుపాకులతో ప్రవేశించారని తెలిపారు. బంగారం కొనుగోలు చేస్తున్నట్లు ప్రవర్తించి తుపాకులతో బెదిరించారని పేర్కొన్నారు. వారిలో నలుగురు నాలుగు రౌండ్లు ఫైరింగ్ చేశారని చెప్పారు. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది గాయపడ్డారని అన్నారు. దోపిడీ తర్వాత వెపన్స్ను వారి వెంటనే తీసుకెళ్లారని వివరించారు.
ఈ దోపిడీకి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నామని సీపీ తెలిపారు. నిందితులను కచ్చితంగా పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. నిందితుల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా మండిపడ్డారు. 24 గంటల్లోగా నిందితులను పట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కాల్పుల ఘటన ప్రభుత్వ వైఫల్యమే అని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అన్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 10.45 గంటల ప్రాంతంలో జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెలరీ సిబ్బంది షాపు తెరిచి లాకర్ల నుంచి డిస్ప్లేలో నగలు పెడుతున్నారు. ఆ సమయంలో రెండు బైక్లపై ఐదుగురు దుండగులు షాపులోకి ప్రవేశించారు. తుపాకులు చూపించి నగలు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై 7-8 రౌండల్ కాల్పులు జరిపారు. అనంతరం పెద్ద బ్యాగ్లో బంగారు నగలను తీసుకుని పరారయ్యారు. ఈ కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జ్యువెలరీ షాపులో దోపిడీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరించారు. ఘటనాస్థలిలో కొన్ని బుల్లెట్ షెల్స్, తుపాకీ మ్యాగజైన్ స్వాధీనం చేసుకున్నారు.