కరీంనగర్ : యాసంగిలో రైతులు వంటి పంట వేసుకోవచ్చు అని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లాలో 351 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలపైన నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
యాసంగి పంట కాలంలో వివిధ రకాల ప్రయివేటు విత్తన కంపెనీలు, సీడ్ కార్పొరేషన్ వారితో ఒప్పందం ఉన్న రైతులు వరి విత్తన ఉత్పత్తి చేసుకోవచ్చని, అదే విధంగా నీరు నిల్వ ఉండే నేలలు, చౌడు నేలల్లో వరి పంటను సాగు చేసుకోవాలని రైతులకు కలెక్టర్ సూచించారు. జిల్లాలో యాసంగి సాగుకు అనుకూలమైన శనగ, పెసర, మినుములు వంటి పప్పుదినుసులతో పాటు వేరుశనగ, నువ్వులు, ఆవాల వంటి నూనెగింజల పంటలను సాగు చేయాలన్నారు. ఈ పంటల ద్వారా అధిక ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ఈ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను సీడ్ కార్పొరేషన్, అధికృత డీలర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. రబీ సీజన్లో ప్రొడక్షన్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. హైబ్రిడ్ లేదా సూటి రకాల వరి విత్తనోత్పత్తి చేసుకోవచ్చని అన్నారు. సీడ్ ప్రొడక్షన్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పంటల సాగులో ఏమైనా సమస్యలు, సందేహాలు ఉంటే రైతు వేదికల ద్వారా జిల్లా వ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో 168 రైస్ మిల్లులు ఉన్నాయని తెలిపారు. సన్న రకం ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సంసిద్ధత వ్యక్తం చేసినందున రైతులు సన్న బియ్యం వరి వేసుకోవచ్చునని కలెక్టర్ సూచించారు. సీడ్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్న రైతులు వరి విత్తన ఉత్పత్తిని చేసుకోవచ్చు అని తెలిపారు. మెట్ట ప్రాంతాల్లో బోరు, బావుల కింద పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలను అధిక మొత్తంలో సాగు చేయాల్సిందిగా రైతులకు కలెక్టర్ సూచించారు.
వర్షాకాలంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని మద్దతు ధరపై కొనుగోలు చేయుటకు వీలుగా 351 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. డీసీఎంఎస్ ద్వారా 50, ఐకేపీ ద్వారా 62, మార్కెటింగ్ శాఖ ద్వారా 8, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 231 కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, ఉద్యానవన శాఖ అధికారి శ్రీనివాస్, వ్యవసాయ యూనివర్సిటీ, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, రైస్మిల్లర్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.