హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో కరీంనగర్ అడ్వకేట్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ను సిట్ అధికారులు వరుసగా రెండో రోజు విచారించారు. సోమవారం దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించిన అధికారులు మంగళవారం మరోమారు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం ఆయన తిరిగి వెళ్తూ.. మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో కీలక నిందితుడు సింహయాజి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరపడం కోసం తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చేందుకు టికెట్ బుక్ చేసింది తానేనని అంగీకరించారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, అయినప్పటికీ మీడియా విష ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు.
నందకుమార్తో అరగంటకు పైగా ఫోన్లో ఏం మాట్లాడారన్న మీడియా సూటి ప్రశ్నకు మాత్రం నీళ్లు నమిలారు. ఆ విషయం తరువాత చెప్తానంటూ సమాధానం దాటవేశారు. ‘అన్ని న్యూస్ చానల్స్ నేను బీజేపీ కార్యకర్తను అయినట్టు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నా బంధువు అయినట్టు ప్రచారం చేస్తున్నాయి. ఆయన కులం వేరు.. నా కులం వేరు. నేను కేవలం ఒక అడ్వకేట్ను. పోలీస్ వాళ్లకు పూర్తిగా సహకరిస్తున్నాను. ఈ క్రైంతో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పారు. సింహయాజికి టికెట్ ఎందుకు బుక్ చేశారని మీడియా ప్రశ్నించగా ‘ఆయన ఒక గురువు. ఒక భక్తుడిగా ఆయన టికెట్ బుక్ చేయాలని కోరితే చేశాను. టికెట్ బుక్ చేయడం నేరమా? రాజ్యాంగంలో ఎక్కడ ఉంది?’ అని ఎదురు ప్రశ్నించారు.
అడ్వకేట్ శ్రీనివాస్.. సింహయాజి తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి టికెట్ బుక్ చేసినట్టు, ఈ కేసులో మరో నిందితుడు నందకుమార్తో గత నెల 14న ఫోన్లో సుదీర్ఘంగా సంభాషించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో శ్రీనివాస్ సిట్ అధికారులు వరుసగా రెండు రోజులపాటు ప్రశ్నించారు. తెలిసింది. చాలా ప్రశ్నలకు శ్రీనివాస్ ముక్తసరి సమాధానాలతోనే సరిపెట్టినట్టు సమాచారం. అతని పాత్రకు సంబంధించి ఆధారాలను చూపించి ప్రశ్నించినప్పుడు మాత్రం కొన్ని వివరాలను వెల్లడించినట్టు తెలిసింది. బుధవారం కూడా మరోమారు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు శ్రీనివాస్ను ఆదేశించినట్టు సమాచారం. ఇక ఈ కేసులో నోటీసులు జారీ చేసినా విచారణకు హాజరుకాని బీఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్ల విషయమై సిట్ అధికారులు న్యాయసలహా ఆధారంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది.