రాష్ట్ర ప్రభుత్వం మహిళా భద్రతకు పెద్దపీట వేస్తూ అన్నిరంగాల్లో వారికి 50 శాతం కేటాయిస్తున్నదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. మీర్చౌక్ పోలీస్స్టేషన్ పరిధిలోని జహీరానగర్లో ఆదివారం భరోసా కేంద్ర నిర్మాణం కోసం హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీతో కలిసి పునాది వేశారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల సంఖ్యే ఇందుకు నిదర్శనమని తెలిపారు. గృహ హింస, వరకట్న బాధితులకు అవగాహన కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి పోలీస్ విభాగం ఆధ్వర్యంలో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దక్షిణ మండలంలో ఏర్పాటు చేస్తున్న 2వ కేంద్రమని, రానున్న రెండేళ్ల వ్యవధిలో భరోసా భవనం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. నేరాల అదుపులో నగర పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో 65 శాతం నగరంలో ఇమిడి ఉన్నాయని హోం మంత్రి తెలిపారు.
అన్నిరంగాల్లో రాణిస్తున్నారు..
తెలంగాణలో ప్రతి విభాగంలోనూ మహిళల సంఖ్య పెరుగుతూ ఉందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని రంగాల్లో మహిళలు మరింత ధీటుగా రాణిస్తారని ఆయన దీమా వ్యక్తం చేశారు. ఇలాంటి సమయాల్లో మహిళల భద్రత చాలా ముఖ్యమైన విషయంగా గుర్తించామని తెలిపారు. ఇప్పటికే దేశంలోనే అత్యంత భద్రత కలిగిన నగరంగా గుర్తింపు పొందినట్లు సీపీ తెలిపారు. నగరంలో మహిళల వేధింపు కేసులు సైతం అత్యల్పంగా నమోదవుతున్నాయని తెలిపారు. మహిళలను వేధించే వారికి పోలీస్ విభాగంలోని షీ టీంల ద్వారా కౌన్సిలింగ్ కల్పించి వారిలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కొత్తగా నిర్మితమవుతున్న భరోసా కేంద్రంలో కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్, పలు కేసుల విచారణకు అవసరమైన న్యాయ సూచనలు, ఇతర సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనున్నామని సీపీ తెలిపారు.
మహిళలను గౌరవించాలి..
లాక్డౌన్ సమయంలో నగర పోలీసులు వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటూ నగర ప్రజలను కాపాడేందుకు కృషి చేశారని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. మహిళల పట్ల గౌరవం పెంచుకోవాలని ప్రతి వర్గంలోని పవిత్ర గ్రంథాలు బోధిస్తున్నాయని సూచించారు. సమాజంలో భరోసా కేంద్రాలు అవసరం లేని వాతావరణం అందుబాటులోకి రావాలని అభిలాషించారు. పాతనగరంలో రూ. 4 కోట్ల నిధులతో పోలీస్ విభాగం ఆధ్వర్యంలో నిర్మించబోతున్న భరోసా కేంద్రం మహిళా సమస్యలను కూలంకషంగా పరిష్కరించడానికి వేదికగా నిలవబోతుందన్నారు. కరోనా మరోసారి ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అందిస్తున్న కరోనా టీకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. త్వరలోనే నేను సైతం టీకాలు తీసుకుని మీ ముందుకు వస్తానని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. యాకత్పుర, మలక్పేట్ ఎమ్మెల్యేలు సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ బలాల, ఎమ్మెల్సీ హసన్ హఫందీ, పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ దామోదర్రెడ్డి, నగర పోలీస్ అధికారులు స్వాతిలక్రా, షికా గోయల్, డీఎస్ చౌహాన్, అనిల్కుమార్, తరుణ్ జోషి, దక్షిణ మండల డీసీపీ గజరావ్ భూపాల్, ఏసీపీలు ఆనంద్, మాజీద్, అంజయ్య, రవిశంకర్ పాల్గొన్నారు.