Kanti Velugu | హైదరాబాద్ : కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి దృష్టి లోపాలను నివారించేందుకు తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలు( Kanti Velugu Camps ) రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) అంధత్వ రహిత సమాజాన్ని నిర్మించాలనే గొప్ప సంకల్పంతో జనవరి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ద్వారా కంటి సమస్యలు దూరమవుతున్నాయని ప్రజలు సంబరపడుతున్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారికి కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తుండటంతో తీసుకున్న వారు మురిసిపోతున్నారు.
కంటి చూపు సరిగ్గా కనిపించక ఇబ్బందులు పడుతున్న మాకు తమ దగ్గరికే వచ్చి కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు నిర్వహించి తమ జీవితాల్లో వెలుగు నింపుతున్న ముఖ్యమంత్రి సల్లగుండాలని తమ దీవెనలిస్తున్నారు. ఈ శిబిరాలకు వచ్చే ప్రజలు ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమం మంచి కార్యక్రమం అని తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జూన్ 15 వరకు కొనసాగించనున్నారు. సెలవు దినాల్లో మినహా సిబ్బంది స్థానికంగానే అందుబాటులో ఉంటూ పరీక్షలు త్వరగా పూర్తిచేసేలా చొరవ చూపుతున్నారు. ఇచ్చిన లక్ష్యాల పూర్తికి కసరత్తు చేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు 1500 బృందాలతో పాటు బఫర్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. అన్ని మండలాలలో, పురపాలికల్లో అవి పనిచేస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను యూనిట్గా తీసుకొని గ్రామాలను ఎంపిక చేశారు. ఆశావర్కర్లు, ఏఎంఎంలు, అధికారులు గ్రామాల్లో జనాభా వారీగా వివరాలు సేకరించి అందుకు అనుగుణంగా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు,సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, పురపాలిక చైర్మన్, కమిషనర్లు, కౌన్సిలర్లు సహాయం తీసుకుంటూ ఆ ప్రాంతంలోని 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు… ఆ కళ్ళు సరిగా లేకపోతే అన్ని సమస్యలే. మన ఇండ్లలో చాలా మంది పెద్దవాళ్ళు, తమకు కంటి సమస్యలు ఉన్నా, చూపు తగ్గినా… ఆ విషయం బయటకు చెప్పరు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బు ఖర్చు అవుతుందని రాజీ పడిపోతారు. ప్రజలకు చాలా మేలు చేసే పథకం కంటి వెలుగు పథకం. ప్రభుత్వం ద్వారా ఉచిత కంటి పరీక్షలతో పాటు, అవసరమైన మందులు, కళ్ళద్దాలు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో అన్ని గ్రామపంచాయతీలు, పురపాలిక సంఘాల పరిధిలోని అన్ని వార్డుల్లో రెండో విడతలో భాగంగా సుమారు కోటిన్నర మందికి కంటి పరీక్షలు చేయాలనేది వైద్య ఆరోగ్యశాఖ అధికారుల లక్ష్యం నిర్ధేశించారు. ఇప్పటి వరకు 88 లక్షల 51 వేల 164 మందికి కంటి పరీక్షలు చేశారు. 14 లక్షల 69 వేల మందికి ఉచితంగా రీడింగ్ అద్దాలు పంపిణీ చేశారు. ఇన్ఫెక్షన్లు ఉన్న వారికి చుక్కల మందుతో పాటు ఏ,డి, బి కాంప్లెక్స్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. శస్త్ర చికిత్సలు అవసరమైన వారికి వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు.