నిడమనూరు: ఆస్థి తగాదా నేపథ్యంలో కన్న తల్లిపైనే కాఠిన్యాన్ని ప్రదర్శించాడో ప్రబుద్ధుడు.. తన తోబట్టువుకు ఎక్కువ ఆస్థి ఇచ్చారన్న కక్షతో గతంలోనే బీరు సీసాతో కన్న తల్లి గొంతులో పొడిచి హత్యాయత్నం చేశాడు. మరోమారు ఇంట్లో ఉన్న కన్న తల్లిపై భార్య, కూతుళ్లతో కలిసి కొడవలి, ఇనుపరాడ్డుతో మెరుపు దాడి చేసి తన రాక్షస బుద్ధిని చాటుకు న్నాడు..
ఈ ఘటన మండలంలోని పార్వతీపురం గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీ పురం గ్రామానికి చెందిన ఇట్టె కోటయ్య, కిష్టమ్మ దంపతుల కుమార్తె మాణిక్యాల విజయలక్ష్మికి భూమిలో వాటా ఎక్కువ గా ఇచ్చారంటూ కొన్నేండ్ల్లుగా తల్లిదండ్రులతో పెద్ద కుమారుడు ఇట్టె సూర్య నారాయణ ఘర్షణ పడుతున్నాడు. ఈ నేప థ్యంలో 2019లో తల్లి కిష్టమ్మను బీరు సీసాతో గొంతులో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తాజాగా ఆదివారం ఉదయం 9.30 గంటల సమయంలో తల్లి కిష్టమ్మ (70) పని చేసుకుంటుండగా ఇంట్లోకి చొరబడిన ఆమె కుమారుడు ఇట్టె సూర్యనారాయణ, కోడలు భూ లక్ష్మి, మనవరాండ్లు భౌమ్య, ప్రసన్నలు పాత కక్షలతో కిష్టమ్మ పై కొడవలి, ఇనుప రాడ్డుతో మూకుమ్మడిగా దాడి చేశారు. కిష్టమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రాగానే ఆమెను వదిలి పెట్టారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రగాయాల పాలైన కిష్టమ్మను హుటాహుటిన మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా దవాఖానకు తరలించారు. బాధితురాలు కుమార్తె మాణిక్యాల విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ డి. సైదులు తెలిపారు.