Nalgonda | ఆ గడ్డన పుట్టడం శాపం… ఆ ఊర్లకు పోవాలంటే భయం.. గుక్కెడు నీళ్లు తాగాలంటే వణుకు.. ఇదీ దశాబ్దాలుగా గుండె మీద ఫ్లోరైడ్ బండ మోసిన నల్లగొండ జిల్లా దుస్థితి. కాకులు దూరని కారడవిలో లేదు ఆ ప్రాంతం. కాకలు తీరిన యోధులమని చెప్పుకొనే కాంగ్రెస్ నేతలకు పుట్టినిల్లు. అర్ధశతాబ్దానికిపైగా రాజ్యమేలినా.. ఫ్లోరైడ్ భూతాన్ని తరమలేని అసమర్థతే వారి ఘనత. తరతరాలు అష్టవంకర్లతో తల్లడిల్లినా ఈ పెద్దమనుషుల కరకు గుండె కరగలేదు. బూజు పట్టిన బుర్రలను దులపలేదు. మంచినీళ్లు ఇవ్వలేదు.
ఉద్యమంలో భాగంగా తెలంగాణ అంతా కలియ తిరిగిన కేసీఆర్ కంటతడి పెట్టుకున్న ప్రాంతాలు ఎన్నో. అందులో ఒకటి మునుగోడు. పద్నాలుగేండ్లలో పోరాట కాలంలో.. ఫ్లోరైడ్ పీడిత మునుగోడు పరిసరాల్లో ఆయన ఐదుసార్లు పర్యటించారు. తెలంగాణ సాధిస్తామన్న నమ్మకం.. వచ్చిన రాష్ర్టాన్ని పునర్నిర్మిస్తామన్న పట్టుదలతో నాడు మునుగోడువాసులకు ఒక మాటిచ్చారు. ఫ్లోరైడ్ రక్కసి తరిమి కొడతామని అభయమిచ్చారు. అన్నట్టుగానే.. తెలంగాణ రాగానే మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టారు. ఫ్లోరైడ్ను తరిమి శుద్ధ జలాలతో మునుగోడు గోడు తీర్చారు.
నాడు మంచినీళ్ల కోసం విలవిల్లాడిన ప్రజల దైన్యానికీ.. నేడు శుద్ధమైన జలాలతో గొంతు తడుపుకొంటున్న జనాల ఆనందానికీ ప్రత్యక్ష సాక్షి ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కంచుకట్ల సుభాష్. 1992 నుంచి ఉద్యమిస్తూ కాంగ్రెస్ పాలకుల పట్టింపులేని తనాన్ని ప్రశ్నించిన వ్యక్తి ఆయన. కాలకూట విషాన్ని తాగలేమని ఆక్రందించిన ఆ గొంతుక.. మా నీటి గోస తీర్చిన కేసీఆరే మళ్లీ గెలుస్తారని ఎలుగెత్తి చెబుతున్నది. నాటి పోరాటాన్ని.. నేటి విజయాన్ని.. ‘నమస్తే తెలంగాణ’తో కంచుకట్ల పంచుకున్నారిలా..
గతంలో ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య తీవ్రత ఎలా ఉండేదో చెబుతారా?
ఈ గడ్డ మీద బిడ్డకు జన్మనివ్వాలంటేనే తల్లిదండ్రులు భయపడే రోజులు నాకు తెలుసు. పరాయి ఊరు నుంచి చుట్టాలొస్తే నీళ్లు తాగడానికి మొహమాటపడటమూ చూశాను. ఏదైనా ఫ్యాక్టరీ వస్తేనో, సాగునీటి ప్రాజెక్టు కింద పోతేనో ఊళ్లు ఖాళీ అవ్వడమే మనకు తెలుసు. కానీ, తాగడానికి మంచినీళ్లు లేక ఊళ్లకు ఊళ్లు వలసపోయిన సందర్భం మునుగోడులో మాత్రమే కనిపించేది.
బోర్లు, బావుల నీళ్లు కూడా తాగడానికి వీలు లేకుండా ఉండేవా?
ఈ నేల పొరల్లో ఫ్లోరైడ్ పాతాళం వరకూ పేరుకుపోయింది. నల్లగొండ జిల్లా మర్రిగూడెం బట్టపల్లి అనే ఊరిలో దాదాపు 250కి పైగా కుటుంబాలు నివాసం ఉండేవి. ఈ పల్లెలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఫ్లోరైడ్ పీడితులే. చేతులు, కాళ్లు వంకర తిరిగి.. నడి వయస్సులోనే ముసలి తనాన్ని అనుభవించేవారు. పలు పరిశోధనల్లో ఇక్కడి బోర్ల నీళ్లు తాగడం వల్ల ఇది వస్తుందని తేలింది. ఆ నీటిని పరీక్షిస్తే ఏకంగా 28 పీపీఎం ఫ్లోరైడ్ ఉన్నట్టు తేలింది. సాధారణంగా తాగునీటిలో ఫ్లోరైడ్ శాతం 0.5 పీపీఎం నుంచి 1 పీపీఎం వరకు మాత్రమే ఉండాలి. అలాంటిది 28 పీపీఎం ఉందంటే సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
తాగునీటి కోసం మీరు చాలా ఉద్యమాలు చేశారు కదా! అప్పటి పాలకులు పట్టించుకోలేదా?
‘ఇక్కడి ప్రజలు విషం తాగుతున్నారయ్యా’ అని గొంతు చించుకొని అరిచినా సమైక్య పాలకులకు పట్టలేదు. నల్లగొండ జిల్లాలోనే నాగార్జునసాగర్ కట్టినా.. నీళ్లివ్వలేదు. కాల్వలు లేకపోవడంతో భూగర్భ జలాలే దిక్కయ్యాయి. వేలాదిగా బోర్లు వేయడంతో ఫ్లోరైడ్ సమస్య జడలు విప్పింది. నిత్యం ఈ నీళ్లే తాగడంతో మూడు తరాలు ఛిద్రమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులంతా ఒక్కటై ‘ఫ్లోరోసిస్ విముక్తి పోరాట సమితి’ని ఏర్పాటు చేసుకుని గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించాం.
ఉద్యమ సమయంలో మీ సమస్యను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారా?
తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ మునుగోడుకు ఐదుసార్లు వచ్చారు. ఒకసారి మూడు రోజులు ఇక్కడే ఉండి ఫ్లోరైడ్ బాధితుల కష్టాలు చూసి చలించిపోయారు. మా పోరాట సమితి కార్యాలయానికి వచ్చి మూడు గంటలు అనేక విషయాలపై చర్చించారు. ‘రాష్ట్రం రాగానే దీని సంగతి తేలుద్దాం’ అని ఆనాడే మాట ఇచ్చారు. చెప్పిన మాట ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రిగా రూ.50వేల కోట్లతో ఇంటింటికీ రక్షిత మంచినీరు ఇచ్చే మిషన్ భగీరథ ఫైల్పైనే తొలి సంతకం చేశారు.
మిషన్ భగీరథ ఫలవంతమైందని భావిస్తున్నారా?
మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లో పైలాన్ ఆవిష్కరణతో ‘మిషన్ భగీరథ’కు శ్రీకారం చుట్టారు కేసీఆర్. నల్లగొండ జిల్లాతోపాటు రాష్ట్రమంతటా ఇంటింటికీ నీళ్లిచ్చి తన చిత్తశుద్ధిని చాటారు. ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామం బట్టపల్లిలోనే అతి పెద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును నిర్మించారు. దీని ద్వారానే వందలాది గ్రామాలకు నీటి సరఫరా జరుగుతున్నది. దశాబ్దాల తర్వాత మేం మంచినీళ్లు తాగుతున్నం. భగీరథ వచ్చిన తర్వాత నల్లగొండ జిల్లాలో కొత్తగా ఒక్క ఫ్లోరైడ్ కేసు కూడా నమోదు కాలేదు. ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించక తప్పలేదు.
ఫ్లోరైడ్ సమస్య పూర్తిగా పరిష్కారమైనట్టేనా?
ఇంటింటికీ నీళ్లు అందడంతో మునుగోడులో కొత్తగా ఫ్లోరైడ్ జాడలు కనిపించడం లేదు. పంటల ద్వారా వచ్చే ఫ్లోరైడ్ను నివారించాలంటే ప్రాజెక్టులు కట్టాల్సిందే. అందుకే ఇక్కడ డిండి ఎత్తిపోతలకు 2015లోనే సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. శివన్నగూడెం, కిష్టరాంపల్లి రిజర్వాయర్ల పనులతో ఇప్పటికే చుట్టుపక్కల భూగర్భజలాలు పెరిగాయి.
తాగునీటి సమస్య తీరింది. సాగునీటి విషయంలో ప్రభుత్వం ఎలా అండగా ఉంటున్నది?
కాంగ్రెస్ నేతలకు మునుగోడు కష్టాలు ఎన్నడూ పట్టలేదు. నల్లగొండ సొరంగాన్ని పక్కనపెట్టేసి పోతిరెడ్డిపాడు తవ్వి రాజశేఖర్రెడ్డి నీళ్లు తీసుకెళ్లారు. పుంగనూర్ ద్వారా చంద్రబాబు నీళ్లు తోడ్కొని పోయారు. నల్లగొండకు మాత్రం నీళ్లు ఇవ్వలేదు. అందుకే మన నేత మనకు ఉంటేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని కేసీఆర్ నిరూపించారు. ఆయన పేరులోనే కాల్వలు.. చెరువులు.. రిజర్వాయర్లు (కేసీఆర్) అని ప్రతిధ్వనిస్తుంది. మా బతుకులు మరింత బాగుపడాలంటే కేసీఆరే మళ్లీ గెలవాలి. పని చేసే ప్రభుత్వాన్ని అందరూ కాపాడుకోవాలి.
కేసీఆర్ను మర్చిపోం
డిండి పూర్తయి నీళ్లొస్తే.. మునుగోడు ప్రాంతం మరో కోనసీమగా మారుతుంది. నల్లగొండ జిల్లాలో సారవంతమైన భూములు ఉన్నాయి. ఒక్కసారి నీళ్లు ఇవ్వగలిగితే ఇక్కడే ఉపాధి లభిస్తుంది. ఇదంతా కేసీఆర్ విజన్ వల్ల
జరుగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ను నల్లగొండ బిడ్డలు ఎన్నటికీ మర్చిపోరు.
… మర్రి మహేందర్రెడ్డి