హైదరాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని కామారెడ్డి మాస్టర్ప్లాన్ ప్రతిపాదన అమలును తాత్కాలికంగా నిలిపివేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. కామారెడ్డి మాస్టర్ప్లాన్ వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, న్యాయమూర్తి జస్టిస్ టీ తుకారాంజీతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. మాస్టర్ప్లాన్ అమలు నిలుపుదలకు తాత్కాలిక నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? పూర్తిస్థాయిలో ఎందుకు నిలిపివేయలేదు? అని హైకోర్టు వివరణ కోరింది. ఒకవేళ మాస్టర్ప్లాన్పై ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తే హైకోర్టు అనుమతి పొందాలని షరతు విధించింది. ఈలోగా, మాస్టర్ప్లాన్పై ముందుకు వెళ్లరాదని చెప్పింది.
దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. కామారెడ్డి మాస్టర్ప్లాన్ విషయంలో ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నదని చెప్పారు. పిటిషనర్ పాల్ జోక్యం చేసుకుంటూ.. సచివాలయంలో అగ్నిప్రమాదం, ప్రారంభోత్సవం వంటి అంశాలను ప్రస్తావించబోగా హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కామారెడ్డి మాస్టర్ప్లాన్ అంశంపైనే మాట్లాడాలని సూచించింది. ఇతర అంశాలు ఇకడ అప్రస్తుతమని స్పష్టంచేసింది. కామారెడ్డి మాస్టర్ప్లాన్పై అదే జిల్లాకు చెందిన రామేశ్వరపల్లికి చెందిన టీ శ్రీనివాస్సింగ్తోపాటు మరో 29 మంది రైతులు, కేఏపాల్ వేసిన వ్యాజ్యాలపై విచారణను ఏప్రిల్ 17కి వాయిదా వేసింది.