బాన్సువాడ, ఏప్రిల్ 10: నాలుగోసారి ఆడపిల్ల పుట్టడంతో 16 రోజుల పసికందును తల్లిదండ్రులు విక్రయించిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. బాన్సువాడ కేంద్రంగా జరిగిన ఈ ఘటన వివరాలను ఎస్హెచ్వో తుల శ్రీధర్ వెల్లడించారు. ఎల్లారెడ్డి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన కిష్టవ్వ, శివయ్య దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగో కాన్పులోనూ కిష్టవ్వ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. నలుగురు ఆడపిల్లలను పోషించలేని స్థితిలో ఉన్న దంపతులు పసిపాపను విక్రయించారు.
పొతంగల్ మండలం హంగర్గ నుంచి బీర్కూర్ మండలం దామరంచకు వలస వెళ్లిన నీరడి శాంతీశ్వర్-అనురాధ దంపతులకు సంతానంలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడకు బస్సులో కిష్టవ్వ దంపతులు వస్తుండగా, శాంతీశ్వర్-అనురాధ దంపతులు 16 రోజుల పాపను రూ.లక్షకు కొనుగోలు చేశారు. ఈ విషయం బయటకు రావడంతో అంగన్వాడీ టీచర్ ఇంద్రాణి ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసిన బాన్సువాడ పోలీసులు.. పసికందును స్వాధీనం చేసుకుని ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించారు.