కామారెడ్డి, జూన్ 24 : రచ్చబండ కార్యక్రమంతో కాంగ్రెస్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య గ్రూపు తగాదాలు బహిర్గతమయ్యాయి. రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండాలో శుక్రవారం నిర్వహించిన రచ్చబండ ఇరువర్గాల మధ్య దాడులకు దారి తీసింది. రాజంపేట మండలంలో కొండాపూర్, ఆర్గొండలో కాంగ్రెస్ ఐటీ సెల్ కన్వీనర్ మదన్మోహన్రావు రచ్చబండ నిర్వహించారు.
అనంతరం ఎల్లారెడ్డిపల్లి తండాలో కార్యక్రమం నిర్వహిస్తుండగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి వడ్డేపల్లి సుభాష్రెడ్డి అనుచరులు అక్కడికి చేరుకొని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సుభాష్రెడ్డి వర్గానికి చెందిన జైపాల్రెడ్డికి, మదన్ మోహన్రావు వర్గానికి చెందిన తూర్పు రాజుకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రాజంపేట పోలీస్ స్టేషన్లో సుభాష్రెడ్డి, మదన్మోహన్ వర్గీయులు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నారు.