యాదాద్రి, అక్టోబర్ 22: స్వయం భూ పంచనారసింహుడిగా కొలువైన యాదగిరీశుడికి కల్యాణోత్సవ సేవను అర్చకులు అత్యంత వైభవంగా జరిపారు. శనివారం ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం.. అనంతరం స్వామి, అమ్మవార్లను దివ్యమనోహరంగా ముస్తాబుచేసి సేవ కార్యక్రమాన్ని చేపట్టారు. గజవాహనంపై స్వామి, అమ్మవార్లను వేంచేపు చేసి తూర్పు అభిముఖంగా సేవను కొనసాగించారు. మండపంలో నిత్య తిరుకల్యాణోత్సవం జరిపించారు. స్వామి, అమ్మవార్ల నిత్యపూజలు అత్యంత వైభవంగా సాగాయి. సాయంత్రం శ్రీస్వామివారి వెండి మొక్కు జోడు సేవలు, దర్బార్ సేవ, తిరువారాధన అత్యంత వైభవంగా చేపట్టారు. స్వామివారిని 15 వేల మంది భక్తులు దర్శించుకోగా, ఖజానాకు రూ.25,99,191 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.