హైదరాబాద్, ఫిబ్రవరి 6 : నిర్మల్ జిల్లా బాసర గ్రామంలోని దస్తగిరి గుట్టపై 10వ శతాబ్దం నాటి కల్యాణి చాళుక్యుల శాసనాన్ని కొత్త తెలంగాణ బృందం గుర్తించింది. ఈ శాసనంలో కల్యాణి చాళుక్య రాజ్యస్థాపకుడు, రెండో తైలపుని కుమారుడు సత్యాశ్రయుని పేరు కనిపిస్తున్నదని కొత్త తెలంగాణ బృందానికి చెందిన శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఆనాటి రాజు అక్కడ నివాసాలు నిర్మాణం చేయించినట్టు ఈ శాసనం ద్వారా తెలుస్తున్నదని పేర్కొన్నారు. శాసనం కింద చెక్కిన త్రిశూలం వల్ల దానిని వేయించిన సట్టిగ శైవమతాన్ని ఆచరించినట్టు అర్థమవుతున్నదని చెప్పారు. సత్యాశ్రయున్ని ఇరవబెడంగ, సట్టి, సట్టిగ అని కూడా పిలిచేవారని పేర్కొన్నారు. స్థానిక యువకులు ఇచ్చిన సమాచారం మేరకు తమ బృందానికి చెందిన బలగం రామ్మోహన్ ఈ శాసనాలను గుర్తించినట్టు హరగోపాల్ తెలిపారు.