సంగారెడ్డి, ఫిబ్రవరి 15 : రాష్ట్రంలో పేదింటి ఆడపిల్ల పెండ్లికి ఆర్థికసాయం అందించే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతో బాగుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టీ జగ్గారెడ్డి కొనియాడారు. ఈ పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్పై ప్రశంసలు కురిపించారు. పెండ్లీడుకొచ్చిన ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచనతో కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ పరంగా రూ.1,01,116 అందజేయడం సంతోషకర విషయమని తెలిపారు. మంగళవారం సంగారెడ్డిలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమన్నారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేను అయినప్పటికీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రశంసిస్తున్నట్టు చెప్పారు.