మెదక్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని మెదక్ ఎమ్మెల్యే యం. పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో హవేళిఘనాపూర్ మండలానికి చెందిన 105 మందికి, మెదక్ పట్టణానికి చెందిన ఆరుగురికి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేద ప్రజలకు వరంలాంటివని, అడబిడ్డల కుటుంబాల్లో ప్రభుత్వ పథకాలు వెలుగులు నింపుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి అర్హులైన వారందరూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు యం.లావణ్య రెడ్డి, మెదక్ ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ సిహెచ్. హనుమంత్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సిహెచ్. శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ.రాధా కిషన్ యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్ కిషోర్, కో ఆప్షన్ నెంబర్ ఉమర్ మొహిద్దీన్, హవేళిఘనాపూర్ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.