Kalwakurthy | కల్వకుర్తి నియోజకవర్గం 1952లో ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గానికి 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 9, టీడీపీ 2, ఇండిపెండెంట్లు 3, జనతా పార్టీ 2, బీఆర్ఎస్ ఒకసారి విజయం సాధించాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని సాధించగా, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. ఎమ్మెల్యేగా జైపాల్యాదవ్ గెలిచారు.
పాలనా సౌలభ్యం కోసం కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు
నియోజకవర్గంలో పాలనా సౌలభ్యం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పలు విప్లవాత్మకమైన మార్పులను తీసుకవచ్చింది. కల్వకుర్తి, ఆమనగల్లు మున్సిపాలిటీలుగా మారాయి. 2014కు ముందు నియోజకవర్గంలో 5 మండలాలు (కల్వకుర్తి, వెల్దండ, ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల) ఉండేవి. ఈ మండలాల ప్రజలు రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మహబూబ్నగర్కు వెళ్లాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు కల్వకుర్తి, వెల్దండ, వంగూర్, చారకొండ, ఊర్కొండ మండలాలతో కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యింది. తలకొండపల్లి, ఆమనగల్లు మండలాల్లోని కొన్ని గ్రామాలతో కొత్తగా కడ్తాల మండలం ఏర్పడింది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల, కడ్తాల మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపింది.
ఊహించని అభివృద్ధి..
ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఈ నాలుగున్నరేండ్లలో నియోజకవర్గంలో గణనీయమైన అభివృద్ధి పనులను చేపట్టారు. కల్వకుర్తిలో 100 పడకలు, ఆమనగల్లులో 50 పడకల దవాఖాన నిర్మాణానికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావుతో కలిసి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ శంకుస్థాపన చేశారు. కల్వకుర్తి కమ్యూనిటీ దవాఖానలో డయాలసిస్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు.
పల్లెల్లో ప్రగతి జోరు..
ఎస్సీ, ఎస్టీ నిధులు మంజూరు చేయించి ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టారు. రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు, పంట కల్లాలను ఏర్పాటు చేశారు. కడ్తాల మండల కేంద్రంలో అత్యాధునికమైన పోలీస్స్టేషన్ను నిర్మించారు. ఆమనగల్లు, తలకొండపల్లి, మాడ్గుల మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలకు సొంత భవనాల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయించారు. చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచుతూ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తాజా ఎన్నికల్లో మరోసారి పోటీ చేస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
దుందుభి వాగుపై రూ.45 కోట్ల అంచనాతో హైలెవల్ బ్రిడ్జి
కల్వకుర్తి మండలం.. రఘుపతిపేట వద్ద దుందుభి వాగుపై రూ.45 కోట్ల అంచనాతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కొత్త గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను నిర్మించారు. కల్వకుర్తి, ఆమనగల్లు మున్సిపాలిటీల్లో దాదాపు రూ.100 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, ఉద్యానవనాలను ఏర్పాటు చేశారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో 240 మంది పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేశారు. వీధి వ్యాపారుల కోసం షెడ్లు నిర్మించారు. బీసీ గురుకుల పాఠశాలను మంజూరు చేయించారు.
…?కాయితి శ్రీనివాస్ రెడ్డి