పీజీ ‘నీట్’ పరీక్ష కటాఫ్ స్కోర్ తగ్గడంతో అర్హులైన అభ్యర్థులు ‘కాంపిటెంట్ అథారిటీ’ కోటా సీట్లకు దరఖాస్తు చేసుకునేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ను విడుదల చేసింది. యూనివర్సిటీ పరిధిలోని కళాశాలలతో పాటు హైదరాబాద్ నిమ్స్ కళాశాలలో కాంపిటెంట్ అథారిటీ కోటా పీజీ వైద్య సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు .
నీట్ పీజీ 2021 అర్హత కటాఫ్ స్కోరును కేంద్ర ప్రభుత్వం ఇటీవల తగ్గించింది. తగ్గిన కటాఫ్ స్కోర్ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులు ఈ నెల 16 ఉదయం 8 గంటల నుంచి 18న సాయింత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు . అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాల్సివుంటుంది . దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విదుదల చేస్తారు. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్సైట్ చూడాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.
పర్సంటైల్ తగ్గించిన కేంద్రం..
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నీట్ 2021 పీజీ కటాఫ్ మార్కులను 15 పర్సెంటైల్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జనరల్ అభ్యర్థులకు 35 పర్సంటైల్ 247 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి 25 పర్సెంటైల్ 210 మార్కులు, దివ్యాంగులకు 30 పర్సెంటైల్ 229 మార్కులుగా కటాఫ్ నిర్ణయించింది.