Kaloji Award | ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్ కాళోజీ అవార్డుకు ఎంపికయ్యారు. పద్మ విభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ‘కాళోజీ నారాయణరావు అవార్డు’ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో చేసిన కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం అందించే కాళోజీ అవార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫారసుల మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కవి జయరాజ్ను అవార్డుకు ఎంపిక చేశారు. ఈ నెల 9న కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో కవి జయరాజ్కు అవార్డును ప్రదానం చేయనున్నారు. అవార్డు ద్వారా రూ.1,01,116 నగదుతో పాటు జ్ఞాపిక అందించి సత్కరించనున్నారు.
జయరాజ్ ఉమ్మడి వరంగల్.. నేటి మహబూబాబాద్ జిల్లాకు చెందిన వారు. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలను అధిగమించి కవిగా మంచి గుర్తింపు పొందారు. పేద దళిత కుటుంబానికి చెందిన జయరాజ్ వివక్షత లేని సమ సమాజం కోసం తన సాహిత్యాన్ని సృజించారు. బుద్ధుని బోధనలకు ప్రభావితమై అంబేద్కర్ రచనలతో స్ఫూర్తి పొందారు. తెలంగాణ ఉద్యమ కాలంలో పల్లెపల్లెనా తిరుగుతూ.. తన ఆటపాట ల ద్వారా ప్రజల్లో తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ భావజాలాన్ని రగిలించడంలో జయరాజ్ ఎంతో కృషి చేశారు. ప్రకృతి గొప్పతనాన్ని వర్ణిస్తూ, పర్యావరణ పరిరక్షణ కోసం సైతం పలు పాటలు రచించారు. మనిషికి ప్రకృతికి ఉన్న అవినాభావ సంబంధాన్ని తన సాహిత్యం ద్వారా సున్నితంగా విశ్లేషించారు. అలాగే ఆయన ముద్రించిన పలు పుస్తకాలు ప్రజాదారణ పొందాయి.