సూర్యాపేట, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లాలో దశాబ్దాల తరబడి పడావుబడిన గోదావరి ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయిన తరువాతే సాగు కళ వచ్చింది. గత, ప్రస్తుత పంట విస్తీర్ణం లెక్కలే ఇందుకు నిదర్శనం. కాళేశ్వరం పూర్తి కాకముందు 2017 యాసంగి వరకు జిల్లా పరిధిలోని ఎస్సారెస్పీ ఆయకట్టులో 55 వేల ఎకరాలకు మించి వరిసాగు కాలేదు. కాళేశ్వరం జలాల రాకతో 2.58 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఒకవేళ జిల్లాకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మాత్రమే గోదావరి జలాలు వస్తే 2017కు ముందు ఆయకట్టు 55 వేల ఎకరాలు మాత్రమే ఎందుకు ఉందనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కొంతమంది అధికారులు, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు లెక్కలు, కట్టు కథనాలతో జిల్లాకు ఎప్పటినుంచో శ్రీరాంసాగర్ జలాలే వస్తున్నాయని అబద్ధాలు ప్రచారం చేయడంపై రైతాంగం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో 25 ఏండ్ల క్రితం ఎస్సారెస్పీ కాల్వలు తవ్వారు తప్ప నీళ్లు ఇవ్వలేదని గుర్తుచేస్తున్నారు. అంతకుముందు ఎస్సారెస్పీ నీళ్లు వస్తే తెలంగాణ సాయుధ పోరాటయోధుడు బీఎన్ రెడ్డి చేసిన గోదావరి జలాల పోరాటం కూడా అబద్ధమేనా? అని ప్రశ్నిస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేట జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద ఉన్న హుజూర్నగర్ నియోజకవర్గంతోపాటు కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల పరిధిలోని మెజారిటీ మండలాల్లో సాగు అయ్యేది. గోదావరి ఆయకట్టు పరిధిలోని తుంగతుర్తి నియోజకర్గంతోపాటు సూర్యాపేట, కోదాడ నియోకవర్గాల పరిధిలోని దాదాపు రెండున్నర లక్షల ఎకరాల పరిధిలో ఒట్టిపోయిన చెరువులు, చుక్కనీరు అందించని బోర్లు, బావులతో నెర్రెలు బారిన నేలలు కనిపించేవి. దాదాపు 25 ఏండ్ల క్రితం గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సారెస్పీ కాల్వలు తవ్వినప్పటికీ నీళ్లు రాలేదు. కేవలం కాల్వలు కాదు, గోదావరి జలాలు తీసుకురావాలని నిరంతర ఉద్యమాలు చేసిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు భీంరెడ్డి నర్సింహారెడ్డి గోదావరి జలాలు రాకముందే 2008లో కన్నుమూశారు. ఆ తరువాత కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్మించడంతో ఎస్సారెస్పీ ఆయకట్టుకు జీవం వచ్చింది. 2017 యాసంగికి ముందు జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల పరిధిలో రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా.. బావులు, బోర్ల కింద 55 వేలకు మించి వరి సాగవలేదు. నేడు 2.58 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందుతున్నాయి. కాల్వల ద్వారా 2.13 లక్షల ఎకరాలకు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన పంట పొలాల్లోకి 10 నుంచి 12 టీఎంసీల నీరు చేరుతున్నది. ఆయకట్టు పరిధిలో సుమారు 450 చెరువులు, కుంటలను 1.5 టీఎంసీలతో నింపడం ద్వారా మరో 45 వేల ఎకరాల స్థిరీకరణ జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గంలో 92,456 ఎకరాలు, సూర్యాపేటలో 80,637, కోదాడలో 39,866 ఎకరాల ఆయకట్టు ఉండగా.. మిగిలిన ఆయకట్టు చెరువులు, కుంటల కింద ఉన్నది.
కాళేశ్వరం జలాలతో పెరిగిన సాగు విస్తీర్ణం
2016 నుంచి 2023 వరకు వరి సాగు విస్తీర్ణం గణాంకాలను పరిశీలిస్తే సూర్యాపేట జిల్లాకు శ్రీరాంసాగర్ నీళ్లు వస్తున్నాయా? కాళేశ్వరం జలాలు వస్తున్నాయా? అనేది అర్థమవుతుంది. జిల్లాలో 5,97,206 ఎకరాల సాగు భూమి ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి కాకముందు 2016లో 1,69,460 ఎకరాలు, 2017లో 1,69,185 ఎకరాల్లో వరి సాగైంది. జిల్లాకు తొలిసారిగా 2018లో కాళేశ్వరం జలాలు రాగా ఏటేటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ 2023లో 4,74,104 ఎకరాలకు చేరింది.నిజంగా శ్రీరాంసాగర్ జలాలే జిల్లాకు వచ్చి ఉంటే 2023 వానకాలం సాగుకు, 2016 సాగుకు ఇంత వ్యత్యాసం ఎందుకు ఉంటుంది?
ఈ యాసంగికీ కాళేశ్వరం జలాలు
ప్రస్తుత యాసంగి సీజన్కు కూడా జిల్లాలోని శ్రీరాంసాగర్ ఆయకట్టుకు కాళేశ్వరం జలాలే అందుతున్నాయి. నిరుడు కాళేశ్వరం నుంచి ఎల్ఎండీ వరకు, అక్కడి నుంచి బయ్యన్నవాగుకు నీళ్లు చేరుకున్నాయి. ప్రస్తుతం బయ్యన్నవాగులో 0.39 టీఎంసీల నీరు ఉండగా, ఇప్పటికే తొలి విడత నీటి విడుదల పూర్తి కాగా రెండో విడత బుధవారం నుంచి ప్రారంభమైంది. రోజుకు 4 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయడంతో నేరుగా పంట పొలాల్లోకి నీరు చేరుతున్నది. నిరుడు వానకాలం నీటి విడుదలతో జిల్లా పరిధిలోని ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. భూగర్భజలాలు పెరిగి 30 నుంచి 40 అడుగుల్లోనే నీళ్లు పుష్కలంగా లభ్యమవుతున్నాయి.
కాళేశ్వరం నీటితోనే పంటలు పండిస్తున్నాం
నాకు మూడెకరాల భూమి ఉన్నది. 30 ఏండ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నా. గతంలో ఎన్నడూ అరెకరం పండించింది లేదు. పంటలు పండక అప్పుల పాలయేవాళ్లం. కాల్వల్లో చుక్కనీరు వచ్చేది కాదు. కేసీఆర్ సర్కారు పుణ్యమాని కాళేశ్వరం నీటితో మూడెకరాలు పారుతున్నది. కాల్వల్లో నీళ్లు నిండుగా వస్తుండటంతో పంటలు బాగా పండుతున్నాయి. కాళేశ్వరం నీటితోనే మా పొలాలు పచ్చగా ఉన్నాయి. మూడెకరాలతోపాటు మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నా. కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చిన కేసీఆర్ సారుకు ఎప్పుడూ రుణపడి ఉంటాం.
– బానోత్ స్వామి, రైతు, బీక్యాతండా, మోతె మండలం
కాళేశ్వరం నీటితో నాలుగెకరాలు సాగు చేస్తున్నా
శ్రీరాంసాగర్ 71 డిస్ట్రిబ్యూటరీ పక్కనే నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది. కానీ ఆ కాల్వలో నీళ్లు రాక వర్షాలే దిక్కయ్యేవి. ఎకరంలో మెట్ట పంట సాగు చేసే వాడిని. మిగతా మూడెకరాలు బీడు ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కాల్వలు తవ్వారు తప్ప, నీళ్లు తేలేదు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం నీళ్లు మొదలయ్యాయి. అప్పటి నుంచి మొత్తం నాలుగెకరాలు సాగు చేస్తున్నా. రెండు పంటలకు సరిపడా నీళ్లు వస్తున్నాయి. వడ్లు కూడా దండిగా పండుతున్నాయి. భూముల రేట్లు బాగా పెరిగాయి. ఇందతా కేసీఆర్ పుణ్యమే. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి నాలాంటి రైతులందరికీ మేలు చేసిండు.
– కడారి నరేశ్, రైతు, అర్వపల్లి
సూర్యాపేట జిల్లాలో వరిసాగు విస్తీర్ణం ఇలా..(2018లో తొలిసారిగా కాళేశ్వరం జలాలు జిల్లాకు చేరాయి)
సంవత్సరం వరి సాగు విస్తీర్ణం(ఎకరాల్లో)
తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో కాళేశ్వరం జలాలు అందుతున్న మండలాలు
మండలం ఎకరాలు