వరద కాలువలో నీళ్లొచ్చుడంటే పైనుంచి కిందికి పారుడే జూసినం. పైకెక్కుడంటే వింతగ ఉన్నది. వానల్లేకుంటే పోచంపాడ్ ప్రాజెక్టుకు నీళ్లు అస్తయా? అనుకున్నం. నీళ్లను ఎత్తిపోస్తరని చెబితే, చిన్న పనేమో అనుకున్నం. కానీ, గిదంతా జూస్తుంటే నమ్మలేకున్నం. మా కోసం, మా బతుకుల కోసం, మా సాగు పనుల కోసం సీఎం కేసీఆర్ గింతగానం పని చేస్తుంటే కండ్లపొంటి నీళ్లొస్తున్నయ్. శ్రీరాంసాగర్లకు నీళ్లు ఇట్ల కిందికెళ్లి గూడ వస్తయని అనుకోలె. కలల గూడా ఊహించనిది ఇయ్యాల కండ్లతోటి చూస్తుంటే మస్తు మంచిగ అనిపిస్తున్నది. మనస్సు సంబురపడుతున్నది.
– ఇదీ ఎస్సారెస్పీ కట్ట దిగువన ఉన్న ముప్కాల్ పంప్హౌస్ను సందర్శించిన రైతన్నల భావోద్వేగం
నిజామాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రాజెక్టే ఆధునిక దేవాలయం. ప్రజల బతుకులను సౌభాగ్యంగా మార్చే నీళ్లే తీర్థం. ఇప్పుడలాంటి తీర్థయాత్ర శ్రీరాంసాగర్ ప్రాజెక్టువైపు నడుస్తున్నది. వస్తాయో, రావోననుకున్న పోచంపాడుకు, కేసీఆర్ నిర్మించిన మానవాతీత ప్రాజెక్టు కాళేశ్వరం నుంచి జలాలు ఎదురెక్కి వస్తుంటే చూసి తీరాల్సిందేనంటూ రైతులంతా తరలివస్తున్నారు. బస్సుల్లో సమూహంగా పోచంపాడు బాట పట్టారు. కొందరైతే తమ కోసం బస్సులు వేయాలని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నారు. అసలే నిజామాబాద్లో రైతు చైతన్యం ఎక్కువ. కాళేశ్వరం నీళ్లు తరలివస్తుంటే చూడకుండా ఉంటారా! ఈసారి పొలాలకు రావనుకున్న నీళ్లను రప్పించటం ఎలా సాధ్యమైందంటూ ఓవైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, వాటిని చూసేందుకు ఆసక్తితో రైతు సంఘాల నాయకులు ప్రాజెక్టు వద్దకు వస్తున్నారు. భవిష్యత్తుతో ఇక పోచంపాడుకు గోదావరి వరద వస్తదా? రాదా? కాల్వలకు నీళ్లు పారుతయా? అన్న అవసరమే లేదు కదా! అన్న ఆలోచన వారిని ఆశ్చర్యపరుస్తున్నది. వానకాలం సీజన్ మొదలై నెలన్నర గడిచి పోయింది.
ఇప్పటికే నాట్లు ముగియాల్సిన సమయం దాటిపోయింది. కానీ, ఈసారి కాలం కలిసిరాలేదు. చినుకు జాడ లేదు. గోదావరిలో వరద సవ్వడి లేదు. చుక్క నీరు లేక పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. రైతాంగం నిరుత్సాహానికి గురవుతున్న వేళ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు రూపంలో అన్నదాతలకు కొండంత అండ దొరికింది. ప్రకృతి ప్రకోపంతో వానలు కురియక పోయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి తిప్పలను తీర్చేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసి పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ వరకు చేర్చుతున్నారు. రోజుకు అర టీఎంసీ చొప్పున వరదకాలువ ద్వారా కాళేశ్వరం జలాలు పరుగులు పెడుతూ శ్రీరాంసాగర్ను నింపుతున్నాయి. ఈ మహత్తర ఘట్టాన్ని నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని రైతులు ఆసక్తిగా తిలకిస్తూ మంత్రముగ్దులవుతున్నారు. 300 కిలోమీటర్ల నుంచి నీళ్లను తరలించడంలో దాగి ఉన్న ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని పరిశీలిస్తూ ‘వహ్వా’ అని ముక్కున వేలేసుకున్నారు. ఇన్ని రోజుల పాటు సీఎం కేసీఆర్ చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు ప్రత్యక్షంగా తమ ముంగిటకు రావడం చూసి రైతులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వరద కాలువలో నిండుగా కనిపిస్తున్న కాళేశ్వరం నీళ్లు, ముప్కాల్ పంప్హౌస్లో భారీ మోటర్లు, ఆ మోటర్ల పనితీరుతో ఉబికివస్తున్న జలాలు, అప్రోచ్ కాలువ ద్వారా ఎస్సారెస్పీలోకి వెళ్తున్న నీళ్లను పరిశీలిస్తూ రైతన్నలు, వారి కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోతున్నారు. రైతుల కోసం కేసీఆర్ చేస్తున్న అపర భగీరథ ప్రయత్నాన్ని ప్రత్యక్షంగా చూస్తూ మురిసిపోతున్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి, బషీరాబాద్ గ్రామాలకు చెందిన అన్నదాతలతో ఎస్సారెస్పీ పరిసరాలు సోమవారం సందడిగా మారాయి. రైతన్నల కోసం సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కృషిని మెచ్చుకుంటూ రైతులు చేసిన జయజయధ్వానాలతో హోరెత్తాయి.
కాళేశ్వర గంగకు మొక్కులు
వృద్ధులు, ఐదు పదులు దాటిన మహిళలు, పురుషులు.. సాగే జీవనాధారం చేసుకున్న యువ రైతులు.. ఇలా ఒకరేమిటి అన్ని వయసుల వారితో శ్రీరాసాగర్ ప్రాజెక్టు పరిసరాలు సోమవారం కిటకిటలాడాయి. వర్షాభావ పరిస్థితుల్లో చేనుకు నీరు చేరడమే గగనమని అనుకున్న రైతులకు.. కాళేశ్వరం నీళ్లు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. తమ బీళ్లను తడిపే కాళేశ్వర గంగమ్మను చూసేందుకు ఐదు బస్సులు, ఇతర వాహనాల్లో భారీగా రైతులు రావడంతో ఎస్సారెస్పీ సందడిగా మారింది. రైతుల రాకను గమనించిన స్థానిక ఎమ్మెల్యే, రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి వారందరికీ భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేయించారు. మంత్రి ఆదేశాలతో బీఆర్ఎస్ నాయకులు.. రైతన్నలు, వారి కుటుంబీకులకు ఇబ్బందులు లేకుండా చూశారు.
సీఎం కేసీఆరే రైతుకు ధైర్యం
కాళేశ్వరం జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి చేరుతుండటం చూస్తుంటే మస్తు సంతోషమనిపిస్తుంది. నీళ్లుంటే వ్యవసాయం రంది లేకుండా సాగుతది. ఇప్పటిదాంకా ఎస్సారెస్పీ నిండాలంటే మహారాష్ట్రలో వానలు పడాలని కోరుకునేటోళ్లం. ఇప్పుడా అవసరం లేదు. కాళేశ్వరం నీళ్లతో ప్రాజెక్ట్ను నింపుతున్నరు. అదును దాటకముందే సకాలంలో పంటలు వేసుకోవచ్చనే ధైర్యం మాకిప్పుడు కేసీఆర్ సారుతోనే కలుగుతున్నది.
– ముత్యాల రాజేశ్వర్, రైతు, బషీరాబాద్
రైతుల ప్రయోజనాల కోసమే
కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ఇంజినీరింగ్ ప్రతిభకు మచ్చుతునక. కేసీఆర్లాంటి నాయకులకు మాత్రమే సాధ్యమయ్యే ప్రాజెక్టు ఇది. అడుగడుగునా రైతుల ప్రయోజనం కోసమే అద్భుతమైన ప్రాజెక్టులు నిర్మించారు. వాటి విలువ ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల్లో తెలుస్తుంది. వర్షాలు లేకపోవడంతో రైతులను ఆదుకునే ముఖ్య ఉద్దేశంతో నీటిని ఎత్తిపోయాలని సీఎం ఆదేశించారు. ఎదురెక్కి వస్తున్న కాళేశ్వర జలా లు రైతుల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నాయి. సీఎంకు రైతులంతా మద్దతు తెలపాలి.
– మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
మొగులుకు ముఖం పెట్టే అవసరం లేదు..
ఆనకాలం షురూ కాంగానే ఆన కోసం మొగులుకు మొఖం పెడుతుంటిమి. ఇప్పుడు గా అవసరం లేకుండా పోయింది. కాళేశ్వరం నీళ్లు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల నింపుతున్నరంటే చూద్దామని ఇయాల మా ఊరోళ్లం ఎస్సారెస్పీకి బస్సులు కట్టుకొని వచ్చినం. ఆ నీళ్లను చూస్తే కడుపునిండినట్టయింది. ఇగ మాకు సాగునీళ్లకు ఢోకా లేదనే ధైర్యం అచ్చింది. సీఎం కేసీఆర్ సార్ కంటే మునుపు ఉన్న ముఖ్యమంత్రులు గిటువంటి ఒక్క గొప్ప పని చేయలేదు. మాలాంటి రైతులకు దేవుడిలాంటోడు కేసీఆర్.
– ముత్తెన్న, రైతు, చౌట్పల్లి
చెప్పింది చేసి చూపించిండ్రు
పోచంపాడ్లకు కాళేశ్వరం నీళ్లు అస్తున్నయంటే సూడనికీ అచ్చిన. గీ నీళ్లను జూత్తుంటే ఎలచ్చన్లప్పుడు కేసీఆర్ సార్ చెప్పిన మాటలు యాదికచ్చినయ్. కాళేశ్వరం నీళ్లను తెచ్చి రైతులకు కష్టం లేకుంట జేత్తనని అప్పుడు మోర్తాడ్ మీటింగ్ల సీఎం కేసీఆర్ సార్ చెప్పిండ్రు. అప్పుడు జెప్పినట్టు ఇప్పుడు జేసి జూపిండ్రు. యాడున్న కాళేశ్వరం.. యాడున్న పోచంపాడ్. గాడికెళ్లి నీళ్లను తెచ్చి గీడ నింపుతుండు. వరద కాలువ నిండుగా వారుతుంటే.. గది జూసి కండ్లల్ల నీళ్లు తిరిగినయి. గ సీఎం సారును, ఏముల ప్రశాంత్రెడ్డి సారును సచ్చేదాంక మరువం.
– గంగామణి, మహిళా రైతు,బషీరాబాద్, కమ్మర్పల్లి, నిజామాబాద్