Kaleshwaram Project | శ్రీరాంసాగర్ వరద కాలువ సజీవ ధారగా ఉండాలన్న కేసీఆర్ జల ఆశయం నెరవేరుతున్నది. తెలంగాణ జలసిరుల గని కాళేశ్వరం.. తన ఇంజినీరింగ్ ఫలాలను, ఫలితాలను అందిస్తున్నది. పునరుజ్జీవ పథకం సరికొత్త చరిత్రను లిఖిస్తున్న సందర్భమిది. వరదకాలువలోకి ఎదురెక్కుతూ వచ్చిన కాళేశ్వరం జలాలు లక్ష్యాన్ని ముద్దాడుతున్న అపురూప క్షణాలివి. గురువారం సాయంత్రం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చెంతన వరదకాలువ జీరోపాయింట్ను చేరుకొన్నాయి. దిగువకు పారే నీటినే చూసిన రైతులు.. ఎదురెక్కి వస్తున్న జల కాళేశ్వరుడిని చూసి కైమోడ్పులు అర్పించారు.
‘కాళేశ్వరం విలువ కష్టకాలంలోనే తెలుస్తుంది’ అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు అక్షరసత్యాలు. చినుకు జాడ లేక ఆగమవుతున్న అన్నదాతకు.. కదిలివస్తున్న కాళేశ్వర జలాలు కల్పతరువుగా మారనున్నాయి. తెలంగాణకు నీటి భరోసానిస్తున్నాయి. నేడు రివర్స్ పంపింగ్తో వరదకాలువ నుంచి కాళేశ్వర జలాలు శ్రీరామసాగరంలోకి చేరనున్నాయి.
హైదరాబాద్/నిజామాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాలమేదైనా.. కలిసి రాకున్నా సాగుకు ఢోకా లేని పరిస్థితికి జలదృశ్యం కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకు సంబంధించి అద్భుత దృశ్యం నేడు ఆవిష్కృతం కానున్నది. సముద్ర గర్భంలోకి వృథాగా పోతున్న నదీ జలాలను మళ్లించి నీటికి సరికొత్త నడకను నేర్పిన సీఎం కేసీఆర్ రైతులకు ఎల్లకాలం సాగునీటి గోస లేకుండా చేసిన తీరు నేడు దృశ్యరూపం దాల్చనున్నది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న సమయాల్లో పునరుజ్జీవపథకం ద్వారా ఎస్సారెస్పీని నింపే అద్భుతఘట్టం నేటి నుంచి పురుడుపోసుకోనున్నది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం కార్యరూపం దాల్చనున్నది. వరదకాలువ ద్వారా తరలివచ్చిన కాళేశ్వర జలాలను నేడు ఎస్సారెస్పీలోకి ఎత్తిపోయనున్నారు. ఇందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు యథావిధిగా కొనసాగుతున్నాయి. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఇరిగేషన్ అధికారులు లక్ష్మీ పంప్హౌస్ నుంచి గాయత్రి వరకు జలాలను నిరంతరాయంగా తరలిస్తున్నారు. లక్ష్మీ పంప్హౌస్ నుంచి సరస్వతి, పార్వతి పంపహౌస్ బరాజ్లకు అక్కడి నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి టన్నెల్స్ ద్వారా నంది మేడారం, గాయత్రి పంప్హౌస్లకు అక్కడి నుంచి వరదకాలువలోకి జలాలను వదులుతున్నారు. వరద కాలువ మొత్తం సామర్థ్యం 1.5 టీఎంసీలు కాగా, ఎప్పుడంటే అప్పుడు ఇటు ఎస్సారెస్పీకి, అటు రాజరాజేశ్వర జలాశయానికి కాళేశ్వర జలాలను తరలించేవిధంగా ప్రస్తుతం వరద కాలువను సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ప్రాణహితలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. బుధవారం సాయంత్రం నాటికి 23,200 వేల క్యూసెక్కుల వరద లక్ష్మీబరాజ్కు చేరుతుండగా, నీటినిల్వ సామర్థ్యం 7.5 నుంచి 9 టీఎంసీలకు చేరుకొన్నది.
గాయత్రి పంప్హౌస్ నుంచి తరలివస్తున్న జలాలు ఎస్సారెస్పీ వైపు పరుగులు తీస్తున్నాయి. 122 కిలోమీటర్ల మేర ఉన్న వరద కాలువలో 73వ మైలురాయి వద్ద నిర్మించిన రాంపూర్ పంప్హౌస్ నుంచి నాలుగు మోటర్ల ద్వారా మొత్తం 5,800 క్యూసెక్కుల జలాలు ఉప్పొంగుతూ బుధవారం రాత్రికే మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట (వరదకాలువ 34వ కిలోమీటరు) వద్ద నిర్మించిన పంపుహౌస్కు చేరుకొన్నాయి. గురువారం ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్యలో మూడు మోటర్లు ఆన్ చేసి మొత్తం 4,350 క్యూసెక్కుల నీటిని నిజామాబాద్ జిల్లాలోని ముప్కాల్ పంప్హౌస్కు తరలింపు ప్రక్రియ చేపట్టగా, కాళేశ్వరం జలాలు బిరబిరమంటూ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చెంతకు గురువారం సాయంత్రానికి చేరుకొన్నాయి. శుక్రవారం ఇక్కడి నుంచి కాళేశ్వరజలాలను ఎస్సారెస్పీలోకి ఎత్తిపోయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జగిత్యాల చీఫ్ ఇంజినీర్ సుధాకర్రెడ్డి వెల్లడించారు.
వర్షాలతో సంబంధం లేకుండా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపే ప్రయత్నం చేయడం ఎస్సారెస్పీ చరిత్రలోనే ఇది సరికొత్త అధ్యాయం. స్వరాష్ట్రంలో ఇంతటి ఘనతకు సీఎం కేసీఆర్ పరిపాలనతోనే సాధ్యమైంది. వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే బోసిపోయే పోచంపాడ్కు కాళేశ్వరం ప్రాజెక్టు రూపంలో వెన్నుదన్ను దొరకగా.. అదిప్పుడు నిజమైంది. జూన్ 1 నుంచి వర్షాకాలం మొదలైనా సీజన్లో నేటి వరకు గోదావరి పరివాహక ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితి నెలకొన్నది. లోటు వర్షపాతంతో కొట్టుమిట్టాడుతున్న ఆయకట్టు రైతులకు కాళేశ్వరం జలాలు ఆశాదీపంగా మారాయి. వరద కాలువ వెంట తరలివచ్చిన కాళేశ్వర గంగను చూసి రైతన్నలంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. ప్రస్తుతం వరద కాలువ ద్వారా కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీ వైపునకు తరలివస్తున్నాయి. 0.100 మీటర్ల పాయింట్ వద్ద ఎత్తిపోతలకు సరిపడా నీటిమట్టం చేరుకోగానే ముప్కాల్ పంప్హౌస్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఎత్తిపోయనున్నారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 1,091 అడుగుల గరిష్ఠ నీటి మట్టానికి 1,065.30 అడుగుల్లో 20.726 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. రెండు రోజులుగా కురిసిన కొద్దిపాటి వర్షాలకు ఎగువ నుంచి స్వల్పంగా మాత్రమే ఇన్ఫ్లో వస్తున్నది. ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలోనే ఎస్సారెస్పీ ఆయకట్టుకు సాగునీరు అందించేలా కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేశారు. నేడు అది కళ్లముందు సాక్షాత్కారం కానున్నది. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ఫలితం నేడు రైతాంగానికి దక్కనున్నది.
1983 నుంచి శ్రీరాంసాగర్కు వరదలు ప్రారంభమయ్యాయి. భారీగా వరదలు వచ్చిన ప్రతి సారి మిగులు జలాలను ప్రాజెక్టు గేట్లు ఎత్తి గోదావరిలోకి వదిలేవారు. ఇలా వృథాగా పోతున్న జలాలను ప్రాజెక్టు దిగువన వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాల్లోని లక్షల మెట్ట భూములకు సాగు నీటిని అందించేందుకు వరద కాలువ నిర్మాణానికి బీజం పడింది. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రం సమీపంలోనే ఎస్సారెస్పీలో వరద కాలువ జీరో పాయిట్ వద్ద ఇప్పుడు వరద కాలువ గేట్లు ఉన్న చోటనే 1993, జూన్ 30న ప్రధాన మంత్రి హోదాలో తెలంగాణ ముద్దు బిడ్డ, దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వరద కాలువకు శంకుస్థాపన చేశారు. 1,070 అడుగుల నీటి మట్టం వద్ద వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ను ఆరు గేట్లతో నిర్మించారు. 22 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో వరద కాలువ నిర్మాణాన్ని చేపట్టారు. 1,074 అడుగుల నీటి మట్టం వరకు ప్రాజెక్టు నుంచి వరద కాలువకు నీటి విడుదల చేసుకునేలా 122 కిలో మీటర్ల పొడవుతో వరద కాలువను నిర్మించారు. ఎస్సారెస్పీ మిగులు జలాలను దిగువకు తరలించడమే వరద కాలువ ప్రధాన ఉద్దేశం కాగా… కేసీఆర్ ఆలోచనతో అదే కాలువ నేడు దిగువ నుంచి ఎగువకు నిండుగా నీళ్లతో కళకళలాడుతుండటం విశేషం.
మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గా ప్రాజెక్టు పొంగిపొర్లుతున్నది. గురువారం ఉదయం వరకు ప్రాజెక్టు పూర్తిగా నిండి అలుగుపోసింది. వనదుర్గా ప్రాజెక్టు కింద ఫతేనగర్, మహబూబ్నగర్ కాలువల ద్వారా పాపన్నపేట, కొల్చారం, మెదక్, హవేళీఘనపూర్ మండలాల పరిధిలోని సుమారు 22 వేల ఎకరాల పైచిలుకు ఆయకట్టుకు నీరందనున్నది. దీంతో రైతన్నలు మురిసిపోతున్నారు.
-పాపన్నపేట్