ముషీరాబాద్ జూన్ 1 : తెలంగాణ అస్తిత్వంపై మళ్లీ దాడులు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ జర్నలిస్ట్ పరాంకుశం వేణుగోపాల స్వామి సూచించారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ‘తెలంగాణ రాష్ట్రం – వర్తమాన పరిస్థితులు’ అనే అంశంపై ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రభుత్వ చర్యలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకోవాలని చెప్పారు. నీటిపారుదల రంగంలో ఏపీ కుట్రలను తిప్పికొట్టాలని పేర్కొన్నారు. ప్రాంతేతరుల పేర్లు పెట్టడంపై వికాస సమితి ఇప్పటికే నిరసన తెలిపిందని గుర్తుచేశారు. తెలంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ నీటి హక్కులను కాలరాసేలా ఏపీ సీఎం చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఏపీకి హక్కు లేకున్నా బనకచర్ల ప్రాజెక్టు పేరుతో గోదావరి జలాలను దోపిడీ చేసే కుట్ర చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహిస్తూ ప్రాజెక్టులను పడావు పెడుతున్నదని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కింద 140 టీఎంసీలను వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రాజెక్టుల్లో నీళ్లు నింపడం లేదని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న రైతులకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ జల దోపిడీని అడ్డుకోవాలని, మన సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ వీసీ సీతారామారావు మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నదని, వ్యవసాయం, పరిశ్రమలు ఇలా ప్రతి రంగంలో సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. ఏ స్ఫూర్తితో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామో ఇప్పుడు దానికి భిన్నంగా పరిపాలన సాగుతున్నదని చెప్పారు. ప్రభుత్వం తెలంగాణ చిహ్నాలను మార్చే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు విభాగం కన్వీనర్ పులి రాజు, కన్వీనర్ మియాపురం రమేశ్ తదితరులు పాల్గొన్నారు