చినుకు జాడలేకున్నా.. వరద కానరాకున్నా ఎత్తిపోస్తున్న కాళేశ్వరం జలాలతో ఎస్సారెస్పీ వరద కాలువ జీవధారగా మారింది. కాళేశ్వర జలాల రువ్వడితో వరద కాలువ పరీవాహక ప్రాంత చెరువుల్లో సవ్వడి నెలకొన్నది. వాన జాడలేకున్నా ఈ ప్రాంత రైతులు మొగులుకేసి చూడాల్సిన పరిస్థితి తప్పింది. 122 కిలోమీటర్ల పొడవైన ఈ వరద కాలువ ప్రాంతంలో ప్రస్తుతం 80 చెరువులకు జలకళ సంతరించుకున్నది. కాలువకు ఏర్పాటుచేసిన 34 తూముల ద్వారా నేరుగా 53 చెరువులకు నీళ్లు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడింది. మత్తడి దూకడంతో దిగువ చెరువులు కలిపి 80 చెరువులకు వరద కాలువ ద్వారా ప్రస్తుతం కాళేశ్వరం జలాలు వెళ్తున్నాయి. కాలం కాకున్నా.. సీఎం కేసీఆర్ ముందుచూపుతో మత్తడి దుంకుతున్న చెరువులను చూసి అన్నదాతలు మురిసిపోతున్నరు. సాగు పనుల్లో నిమగ్నమైన రైతన్నలు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నరు.
కరీంనగర్/నిజామాబాద్, జూలై 15, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రీడిజైనింగ్లో భాగంగా శ్రీరాంసాగర్ పునర్జీవ పథకంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరద కాలువ రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ఎగువకు నీళ్లు తీసుకెళ్లడమేకాదు.. తూముల విషయంలోనూ సమూల మార్పులుచేయడంతో నేడు చెరువులు మత్తడి దూకే సౌకర్యం ఏర్పడింది. వరద కాలువ 122 కిలోమీటర్లు ఉండగా, గతంలో ఈ కాలువ పొడవున 16 తూములు మాత్రమే ఉండేవి. వాటిని కూడా అశాస్త్రీయంగా నిర్మించారు. 6 మీటర్ల ఎత్తులో 1 నుంచి 1.5 డయాతో ఆనాడు తూములను ఏర్పాటుచేశారు.
అంటే వరద కాలువలో 6 మీటర్ల ఎత్తులో నీళ్లు పారితేనే ఆ తూములు ఉపయోగపడేవి. వరద కాలువలో 6 మీటర్ల ఎత్తు నీరు ఉండటం ఆనాడు సాధ్యమయ్యేది కాదు. అందుకే నాడు తూములున్నా పరీవాహక ప్రాంతాల చెరువులకు నీళ్లు రాక అన్నదాలకు ప్రయోజనం చేకూరలేదు. ఈ ప్రాంతంపై పరిపూర్ణ అవగాహన ఉన్న సీఎం కేసీఆర్.. తూములను సమూలంగా మార్చేశారు. గతంలో ఉన్న 16తో కలిపి వాటి సంఖ్యను 34కు పెంచారు. కాలువ పరిధిలోని చెరువుల ఎత్తు పల్లాలను పరిగణనలోకి తీసుకొని.. శాస్త్రీయ పద్ధతిలో వీలైనంత సులువుగా ఎక్కువ నీరు చెరువుల్లో చేరేందుకు వీలుగా డిజైన్చేశారు. ఆ మేరకు గతంలో ఉన్న 6 మీటర్ల ఎత్తును 2 నుంచి 4 మీటర్లకు తగ్గించారు. డయాను 3 ఫీట్లకు పెంచి తూములను ఏర్పాటుచేశారు. ప్రస్తుతం 34 తూముల ద్వారా నేరుగా 53 చెరువులకు నీళ్లు ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడింది. మత్తడి దూకడంతో దిగువ చెరువులు కలిపి 80 చెరువులకు వరద కాలువ ద్వారా ప్రస్తుతం కాళేశ్వరం జలాలు చేరుతున్నాయి.
మత్తడి దూకుతున్న చెరువులు
ఈ నెల 2వ తేదీ నుంచి లక్ష్మి బరాజ్ ద్వారా ఎత్తిపోస్తున్న కాళేశ్వరం జలాలు నలుదిశలా పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. శనివారం సాయంత్రం వరకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 2 టీఎంసీల కాళేశ్వరం జలాలు చేరగా.. ఇంకా ఎత్తిపోతల ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. తద్వారా వదర కాలువ పొడవున ఉన్న ఒక్కో చెరువు నిండుతూ.. మత్తడి దూకుతున్నాయి. మెట్పల్లి మండలం రాజేశ్వర్రావుపేట శివారులోని వరద కాలువ తూము ద్వారా నీళ్లు రాగా, బండలింగాపూర్ పెద్ద చెరువు మత్తడి దుంకింది. కథలాపూర్ మండలం దూలూరులోని నాగలమల్లప్ప చెరువు మత్తడి దుంకుతుండగా, దిగువన సిరికొండలోని నల్లచెరువు, పెగ్గెర్లలోని ఊర చెరువులు నిండాయి. తక్కళ్లపల్లికి చెందిన ఉదకమ్మ చెరువు మత్తడి దుంకుతున్నది.
మేడిపల్లి మండలంలోని కల్వకోట పెద్ద చెరువు, కన్నేరు కుంట, చింతల చెరువు, వీరన్నకుంటలు మత్తడి దుంకుతున్నాయి. కోరుట్ల మున్సిపాలిటీ ఎకీన్పూర్ శివారులోని స్తంభాల చెరువుకు కూడా గోదావరి జలాలు చేరుకున్నాయి. ఇది మత్తడి దుంకితే తాళ్ల చెరువులోకి, అక్కడి తూము ద్వారా కంచరకుంట, మద్దుల చెరువులోకి చేరనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని నర్సింగాపూర్, విలాసాగర్ పెద్ద చెరువుకు చేరాయి. గంగాధర మండలం బూరుగుపల్లి వద్ద వరద కాలువ తూముల ద్వారా బూరుగుపల్లి చెరువు నిండి మత్తడి దుంకింది. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని దొన్కల్ గ్రామానికి చెందిన రాజుల కుంటకు కాళేశ్వరం జలాలు చేరుతున్నాయి. అక్కడి నుంచి పెద్ద చెరువు, మూలకుంటకు పరుగులు తీస్తున్నాయి. రెండుమూడు రోజుల్లో చెరువులన్నీ పూర్తిగా నిండే అవకాశాలున్నాయి.
భూగర్భ జలానికి ఊతం
వేల్పూర్ మండలం అంక్సాపూర్ సమీపంలో కాళేశ్వరం జలాలు మూడు చెరువులను నింపుతున్నాయి. వరద కాలువకు రూ.30 లక్షలతో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పైప్లైన్ వేయించారు. ఇప్పుడు అంక్సాపూర్లోని ఊర చెరువు, ధర్మారెడ్డి, బంజని కుంటలు నిండుకుండగా మార్చుతున్నారు. ఈ చెరువుల కింద ఉన్న సుమారు వేయి ఎకరాలకు సాగునీరు అందనున్నది. చెరువులు జలకళను సంతరించు కుంటుండటంతోపాటు భూగర్భ జలమట్టం అమాంతం పెరుగుతున్నది. తద్వారా బోరు బావుల కింద సాగు చేసుకొనే రైతన్నలకు ధైర్యం వచ్చింది. పోచంపల్లిలోని చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతున్నది. ఈ చెరువు కింద సుమారు 100 ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఏర్పడింది. నవా బు లిఫ్ట్ ద్వారా 8 గ్రామాలకు సాగునీరు అం దుతున్నది. లక్ష్మి డీ3 కెనాల్ ద్వారా పడగల్ గ్రామంలోని నవాబ్ చెరువులోకి కాళేశ్వరం జలాలు చేరనున్నాయి. దీంతో లిఫ్ట్ కింద సుమారు 9 వేల ఎకరాలకు నీరు చేరుతుందని అంచనాలున్నాయి. బాల్కొండ నియోజకవర్గం మొత్తం 16 చెరువులను వరద కాలువ ద్వారానే నింపే ప్రయత్నం చేస్తున్నారు.
దటీజ్ కేసీఆర్..
అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే సీఎం కేసీఆర్ నైజం. వరద కాలువ ద్వారా దిగువకు మాత్ర మే పారే నీళ్లను ఎదురెక్కించి రైతన్నల ఇబ్బందులను తీర్చిన కేసీఆర్ అసాధారణ వ్యక్తి. కేసీఆర్ పరిపాలనలో రైతులు సంతోషంగా ఉంటున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, పంటల కొనుగోళ్లతో రైతులకు ఆపద్బాంధవుడిగా కేసీఆర్ మారారు. దటీజ్ కేసీఆర్ అన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పవిత్రమైన జలాలను 300 కిలోమీటర్ల మేర ఎత్తిపోసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పోయడం మామూలు విషయం కాదు. ఇందులో భాగంగా వరద కాలువ ద్వారా చెరువులను ఎప్పటికప్పుడు నింపుకోవడంతో రైతులకు వర్షాభావ పరిస్థితుల్లోనూ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
– వేముల ప్రశాంత్రెడ్డి, మంత్రి
సాగునీళ్లుంటెనే ఆనందం
సాగునీళ్లుంటె నే పంటలు పం డుతయ్. పంట లు పండితేనే రైతుల కండ్లలో ఆనందం. లేకుం టే భూమినే నమ్ముకున్న రైతు పరిస్థితి ఆగమైతది. వానకాలం చాలై న్లైనా పెద్దవాన లేదు. దీంతో సాగునీళ్లకు కష్టమైతుందనుకున్నం. కానీ, సీఎం కేసీఆర్ పుణ్యమా అని కాళేశ్వరం నీటిని వరద కాలువల ఎత్తిపోస్తూ రైతుల కష్టాలు తీరుస్తున్రు. వరద కాలువ తూముతో మా ఊరు బండలింగాపూర్ పెద్దచెరువుకు నీళ్లు వదలినంక పూర్తిగ నిండింది. ఇప్పుడు అలుగు పారుతాంది. సాగునీరు దొరుకుడే కష్టమనుకున్న మాకు చెరువు అలుగు పారేలా చేసిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటం.
– ఇట్టెడి ఎల్లారెడ్డి, రైతు, బండలింగాపూర్ (జగిత్యాల జిల్లా)
మా ఆశలకు జీవం పోసిన సీఎం కేసీఆర్
నాకు మూడెకరాల భూమి ఉ న్నది. ఈ యేడు నాట్లు వేసే టైంకు వర్షాలు రాకపోవడంతో ఎట్లా అని చాలా రందివడ్డం. చెరువుల నీళ్లు లేకపాయె. బావులల్ల అంతంత మాత్రమే ఉండే. ఇగ పంటలు వేసుడు కాదు అనుకున్నం. ఇంతల సీఎం కేసీఆర్ కాళేశ్వరం జలాలను వరద కాలువలోకి వదిలి మా ఆశలకు జీవం పోసిండు. తూముల ద్వారా మా ఉదకమ్మ చెరువు పూర్తిగా నిండింది. కష్టసమయాల్లో ఆదుకున్న సీఎం కేసీఆర్కు అండగా ఉంటాం.
– అంగ రాధ, మహిళా రైతు, తక్కళ్లపల్లి (జగిత్యాల జిల్లా)
మొదటిసారి చెరువులు నింపుకుంటున్నం
వరద కాలువ ఏర్పడినప్పటి నుంచి దీని ద్వారా మొదటిసారి మా ఊరు చెరువులను నిం పుకుంటున్నం. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిండితేనే వరద కాలువలో నీళ్లు కనిపించేవి. కానీ మా ఊళ్లకు వచ్చేవి కాదు. కాంగ్రెస్ హయాంలో వరద కాలువకు తూము నిర్మించినా మాకు పనికిరాలేదు. మంత్రి ప్రశాంత్రెడ్డి పుణ్యమా అని మళ్లీ రూ.60 లక్షల ఖర్చుతో తూము, సీసీ కాలువ పనులు చేయించడంతో వరద కాలువ నీటితో చెరువులు నింపుకుంటున్నం.
– మధు, రైతు, దొన్కల్, నిజామాబాద్