Kaleshwaram | కరీంనగర్, మార్చి 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ పాలనలో ఐదేండ్లపాటు జలభాండంగా విరాజిల్లిన మధ్యమానేరు ప్రాజెక్టు (శ్రీరాజరాజేశ్వర రిజర్వాయర్) ఇప్పుడు వెలవెలబోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడునెలల్లోనే చుక్కనీటికి దినదిన గండంలా మారింది.
ఈ ప్రాజెక్టు నుంచి కొండపోచమ్మ వరకు జలాలను ఎత్తిపోసిన ఘనతను బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖించుకుంటే, పక్కనే ఉన్న అన్నపూర్ణ ప్రాజెక్టుకు కూడా నీరు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అనే చెడ్డ పేరును కాంగ్రెస్ తెచ్చుకుంటున్నది. నాడు ఎఫ్ఆర్ఎల్ ప్రకారం చివరి భూమి వరకు ప్రాజెక్టులో నీరు ఉండగా.. నేడు అవే భూములు ఎడారిని తలపిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మధ్యమానేరు ప్రాజెక్టును వాటర్హబ్గా మార్చింది. కాళేశ్వరం నుంచి గాయత్రి పంపుహౌస్ ద్వారా మధ్యమానేరుకు నీటిని ఎత్తిపోసింది.
అక్కడినుంచి ఇటు దిగువమానేరు జలాశయం, అటు అన్నపూర్ణ రిజర్వాయర్ మీదుగా కొండపోచమ్మసాగర్, ఎగువమానేరు వరకు నీటిని ఎత్తిపోసింది. మధ్యమానేరుకు కాళేశ్వరం ఎత్తిపోతలు 2019లో ప్రారంభం కాగా, అప్పటినుంచి 2023 డిసెంబర్ వరకు ఈ ప్రాజెక్టు 365 రోజులూ నిండుకుండలా ఉండేది. మధ్యమానేరు ప్రాజెక్టు మొత్తం సామర్థ్యం 27.50 టీఎంసీలు కాగా, నిరుడు మార్చిలో 23 టీఎంసీల నీటి నిల్వలున్నాయి.
నీటి నిల్వలు ఎంత తగ్గితే అంత నీటిని కాళేశ్వరం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తిపోసింది. గత మార్చిలో ఒకవైపు కొండపోచమ్మసాగర్కు నీటిని ఎత్తిపోస్తూనే, ఎల్ఎండీ (దిగువ మానేరు జలాశయం) పరిధిలోని పంటలకు ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు వేల క్యూసెక్కుల నీటిని నిరంతరాయంగా విడుదల చేసింది. కానీ, ప్రస్తుతం మూడు నెలల కాంగ్రెస్ పాలనలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కాళేశ్వరం నుంచి ఎత్తిపోతలు ప్రారంభమైన తర్వాత ఏనాడూ లేని దుస్థితి నేడు మధ్యమానేరు ప్రాజెక్టులో కనిపిస్తున్నది. ప్రస్తుతం ఇక్కడ తొమ్మిది టీఎంసీల నీరు మాత్రమే ఉన్నది.
గేట్లు తెరిచినా చుక్కనీరు వెళ్లడం లేదు
మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి ముందుగా అన్నపూర్ణ రిజర్వాయర్, అక్కడినుంచి రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ వరకు నీటిని కేసీఆర్ ప్రభుత్వం ఎత్తిపోసింది. మధ్యమానేరు నుంచి మొదటిసారిగా 2020 మే 11న అన్నపూర్ణకు నీటిని ఎత్తిపోశారు. అప్పటినుంచి అవసరాలకు అనుగుణంగా ఎత్తిపోతలు కొనసాగుతూ వచ్చాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా అనంతగిరి వద్ద నిర్మించిన ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 3.5 టీఎంసీలు.
అన్నపూర్ణ రిజర్వాయర్కు మధ్యమానేరు జలాశయానికి మధ్య దూరం 11.186 కిలోమీటర్లు. మధ్యమానేరు నుంచి అన్నపూర్ణకు నీటిని పంపించడానికి ఓగులాపూర్ గ్రామపరిధిలో కాలువలు, దానిపై క్రస్ట్గేట్లు ఏర్పాటుచేశారు. ఇవి ఓపెన్ చేస్తే అన్నపూర్ణ రిజర్వాయర్ పరిధిలో ఏర్పాటుచేసిన సర్జ్పూల్కు గ్రావిటీ, సొరంగమార్గం ద్వారా నీరు వెళ్లేది. ఆ మేరకు ఎప్పటికప్పుడు సర్జ్పూల్ నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్లోకి ఎత్తిపోసేవారు.
ఇప్పుడు మొత్తం క్రస్ట్గేట్లు ఎత్తినా చుక్కనీరు కూడా అన్నపూర్ణకు వెళ్లడంలేదు. అలా వెళ్లాలంటే మధ్యమానేరులో పది టీఎంసీలపైన నీటి నిల్వలు ఉండాలి. ప్రస్తుతం తొమ్మిది టీఎంసీలే ఉండటంతో పైకి నీరు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. దీంతో అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొంచపోచమ్మసాగర్, ఎగువమానేరు ప్రాజెక్టులు, వాటి కాలువలను నమ్ముకొని పంటలు వేసిన రైతులు సాగునీరు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇదే కొనసాగితే ఎగువన ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నాడు నీటి నిల్వలు, నేడు వరిపొలాలు
ప్రస్తుతం మధ్యమానేరు వెనుక భాగమంతా ఎడారిని తలపిస్తున్నది. కేసీఆర్ హయాంలో నిండుకుండలా ఉన్న ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అడుగంటింది. ఇటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి గానీ, అటు కాళేశ్వరం నుంచి గానీ నీళ్లను మధ్యమానేరుకు ఇచ్చే సమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని భావించిన రైతులు ప్రాజెక్టు చివరి భూముల్లో వరితోపాటు వివిధ రకాల పంటల సాగు చేస్తున్నారు. చీర్లవంచ, అగ్రహారం, చింతల్ఠాణా, రుద్రారంతోపాటు మరికొన్ని గ్రామాల రైతులు, మధ్యమానేరు భూముల్లో సాగు చేసుకుంటున్నారు.
ఏ పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు నింపదు కాబట్టి.. తమ పంటలు ప్రాజెక్టులో మునిగిపోయే ప్రసక్తే లేదన్న ధీమా వారిలో కనిపిస్తున్నది. ఇదిలాఉండగా, ప్రాజెక్టు చివరి భూముల్లోని బావుల్లోనూ నీళ్లు అడుగంటిపోతున్నాయి. మహా అయితే ఈ పంటకు నీళ్లు సరిపోతాయని రైతులు భావిస్తున్నారు. కేసీఆర్ హయాంలో వాటర్హబ్గా, జంక్షన్గా ఉన్న మధ్యమానేరులో జలాలు అడుగంటిపోవడం వల్ల దానికి అనుసంధానంగా ఉన్న ఎన్నో ప్రాజెక్టులపై ఆ ప్రభావం పడుతున్నది. ప్రభుత్వం ఇప్పటికైనా కాళేశ్వరం ఎత్తిపోతలు చేపడితే, లక్షలాది కుటుంబాలకు జలాలు అందుతాయని ఈ ప్రాంత రైతులు భావిస్తున్నారు.