హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 9 పనులకు స్వాతంత్య్ర సమరయోధు డు, తెలంగాణ సీనియర్ రాజకీయవేత్త, దివంగత చెన్నమనేని రాజేశ్వర్రావు పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించా రు. రాజేశ్వర్రావు శత జయంతి సందర్భంగా (ఆగస్టు 31) వారు చేసిన సామాజిక సేవలను గుర్తిస్తూ ఆ పనులకు ఆయన పేరును సీఎం ఖ రారు చేశారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పరిధిలో సాగునీరు, తాగునీరు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్యాకేజీ 9 పనులు అంటే.. మిడ్ మానేరు నుంచి అప్పర్ మానేరు దాకా మలపేట రిజర్వాయర్తోపాటు దాని పరిధిలోని కాల్వలకు ‘చెన్నమనేని రాజేశ్వర్రావు’గా నామకారణం చేశారు. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులివ్వనున్నది.
మెట్టప్రాంతమైన సిరిసిల్ల, వేములవాడల పరిధిలోని రైతాంగానికి సాగునీటిని అందించడానికి మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్రావు నిరంతరం కృషిచేశారు. ప్రతిపక్షనేతగా అనేక పోరాటాలు కూడా చేశారు. మెట్టప్రాంతాలకు ఎత్తిపోతలే శరణ్యమని ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో మంది ముఖ్యమంత్రులతో వాదించారు. ప్రతిపాదనలు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరోవైపు మెట్టప్రాంతాలకు సాగునీటిని అందించేందుకు నిరంతరం కృషిచేశారు రాజేశ్వర్రావు. కోనరావుపేటలోని నిమ్మపల్లి ములవాగు ప్రాజెక్టును తన హయాంలో నిర్మించాడు. తద్వారా చుట్టూ 5 గ్రామాలకు సుమారు 25 వందల ఎకరాలకు సాగునీరు అందించి బీడు భూములు సస్యశ్యామలం చేశారు. అయిప్పటికీ వర్షం వస్తేనే ప్రాజెక్టు నిండే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రెండు పంటలకు సాగునీరు అందించాలంటే ఎత్తిపోతల ద్వారానే సాధ్యమని రాజేశ్వరావు అప్పటి ప్రభుత్వాలతో, ముఖ్యమంత్రులతో పలుమార్లు విన్నవించారు. కోనరావుపేట మం డలంలోని మల్కపేట రిజర్వాయర్ నుంచి నిమ్మపల్లి మూలవాగు ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించారు. అయినా ఏ నాయకుడూ దానిని పట్టించుకోలేదు.
సీఎం కేసీఆర్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాజేశ్వర్రావు కల సాకారమైంది. సిరిసిల్ల, వేములవాడల పరిధిలోని దాదాపు 87 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్యాకేజీ 9 పనులు చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మల్కపేట రిజర్వాయర్ నుంచి పైప్లైన్ వేసి నిమ్మపల్లి ములవాగు ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఇప్పటికే పనులన్నీ తుదిదశకు చేరుకున్నాయి. దీంతో మెట్ట ప్రాంతాల చెరువులు కొండచెరువు, రాయిని చెరువు, గర్జనపల్లి, మద్దిమల్ల బాబాయి చెరు వు, చీమనపల్లి ప్రాంత రైతులకు సాగు నీరు కొద్ది రోజుల్లోనే అందనుండగా, రాజేశ్వరావు 60 ఏండ్ల కల సాకారం కానున్నది. ఇప్పుడు అవే సాగునీటి పనులకు రాజేశ్వర్రావు పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేయడంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.
శతజయంతిని పురస్కరించుకొని రాజేశ్వర్రావు సామాజిక సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ‘స్వాతంత్య్ర సమరయోధుడిగా, తెలంగాణ తొలితరం రాజకీయ వేత్తగా, నిరంతరం ప్రజల కోసం పోరాడిన గొప్పనేత చెన్నమనేని రాజేశ్వర్రావు’ అని కొనియాడారు. తెలంగాణ రైతాంగం కోసం ఆనాటి కాలంలోనే వరద కాల్వ కోసం ఎత్తిపోతల పథకాల కోసం పోరాడిన చరిత్ర ఆయనదని, సిరిసిల్ల వేములవాడ ప్రాంతాల నుంచి అత్యంత ప్రజాదరణ కలిగిన నేతని పేర్కొన్నారు. పలు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి ఆ ప్రాంత ప్రజల సాగునీరు, తాగునీరు కష్టాలను తీర్చడానికి ఎత్తిపోతల పథకం కోసం చెన్నమనేని ఎన్నో పోరాటాలు చేశారని గుర్తుచేశారు. నాటి వారి ఆకాంక్షలను ప్రతిఫలించే విధంగా స్వరాష్ట్రంలో సాగునీరు ప్రాజెక్టులను ఎత్తిపోతల పథకాలను నిర్మించుకున్నామని, తెలంగాణ రైతాంగం నేడు దేశం గర్వించే స్థాయిలో పంటలు పండిస్తున్నదని సీఎం కేసీఆర్ వివరించారు. రాజేశ్వర్రావు ప్రజాప్రతినిధిగా పనిచేసిన ప్రాంత ప్రజలకు కాళేశ్వరం పథకంలో భాగంగా నిర్మించిన ప్యాకేజీ 9 ద్వారా సాగునీరు అందుతున్నదని, మిడ్ మానేరు (ఎస్ఆర్ఆర్) నుంచి ఎత్తిపోతల ద్వారా అప్పర్ మానేరు దాకా నీటి సరఫరా జరుగుతున్నదని, ఈ నేపథ్యంలో నాటి వారి కృషిని గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ, మలపేట రిజర్వాయర్కు దాని పరిధిలోని ఎత్తిపోతల పథకానికి మొత్తంగా ప్యాకేజీ 9కు ‘చెన్నమనేని రాజేశ్వర్రావు’ పేరు పెట్టామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.