Mustabad | ముస్తాబాద్, మార్చి4: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వా రా ఎదురెక్కిన గోదావరి నీళ్లు మల్లన్నసాగర్ కాలువ ద్వారా ముస్తాబాద్ మండలానికి చేరాయి. మొదట మద్దికుంట గ్రామంలోని ఊరచెరువు నిండిపోయి మత్తడి మీది నుంచి పరవళ్లు తొక్కుతున్నాయి. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ కాలువ ద్వారా దుబ్బాక మండలం రాజక్కపేట వరకు వచ్చిన నీరు.. అక్కడి నుంచి రెండు కాలువల ద్వారా దిగువకు వస్తున్నది.
ఒక కాలువ ద్వారా ముస్తాబాద్ మండలంలోని మద్దికుంట చెరువుకు వస్తుండగా, మరో కాలువ ద్వారా మోహినికుంట చెక్డ్యాంకు వస్తున్నది. వారంలోగా ఆయా గ్రామాల్లో చెరువులు, కుంటలు నిండనున్నాయి. చివరి దశలో ఉన్న యాసంగి పంటలకు పుష్కలంగా సాగునీరు అందుతుండటంతో రైతులు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.