దక్కన్ పీఠభూమిలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతం.. సమద్రమట్టానికి ఏకంగా 550 మీటర్ల ఎత్తు. బోర్లు వేయడం, ఇసుక తీయడంపై నిషేధం. తాగుదామంటే గుక్కెడు నీటికి తండ్లాడిన జనం. బతుకే అగమ్యగోచరం. ఇదీ జనగామ ప్రాంత దుస్థితి. కానీ, తెలంగాణ ప్రభుత్వం రావడంతో ఈ ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. తొమ్మిదేండ్లలో జనగామ జిల్లాకు జలకళ వచ్చింది. దేవాదుల రూపంలో గోదారమ్మ గలగలా పారింది. ఎండాకాలంలోనూ చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. నాటి అతి దుర్భిక్ష ప్రాంతం.. నేడు బంగారు పంటల కేంద్రంగా మారింది.
Jangaon | జనగామ, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు కరువుకు కేరాఫ్గా ఉన్న జనగామ ప్రాంతం.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్త రూపు సంతరించుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం గడిచిన తొమ్మిదేండ్లలో చేపట్టిన కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల ద్వారా ప్రతీ పల్లె పచ్చని మాగాణంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల జీవన విధానం పూర్తిగా కొత్త పుంతలు తొక్కింది. తెలంగాణ రాక ముందు ఈ ప్రాంత వరప్రదాయినీ దేవాదుల రిజర్వాయర్ పనులు పూర్తికాలేవు. కన్నెబోయినగూడెం, మద్దూరు మండలం లద్నూరు దేవాదుల రిజర్వాయర్ పనులు అసంపూర్తిగా మిగిలాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ పనులు పూర్తిచేసి నీళ్లు విడుదల చేశారు. చేర్యాల మండలం తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, బచ్చన్నపేట మండలాల్లోని చెరువులకు గోదావరి జలాలు విడుదల చేశారు. చేర్యాల నగర పంచాయతీని మున్సిపాలిటీగా మార్చారు. రూ.35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.11 కోట్లతో ప్రభుత్వ దవాఖాన నిర్మించారు. పట్టణంలో వెజ్, నాన్వెజ్ మార్కెట్, రూ.కోటితో అంబ్కేదర్హాల్ నిర్మించారు. మున్సిఫ్ కోర్టును ఏర్పాటు చేశారు. కొమురవెల్లిలో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు, చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట, కొమురవెల్లి మండలాల్లో రూ.10 కోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీలను నిర్మించారు.
325 కోట్లతో తపాస్పల్లి రిజర్వాయర్కు కాలువ
చేర్యాల మండలాన్ని విభజించి కొమురవెల్లి మండలంగా, మద్దూరు మండలాన్ని విభజించి ధూళిమిట్ట్ట మండలంగా, నర్మెట మండలాన్ని విభజించి తరిగొప్పుల మండలం ఏర్పాటు ఏర్పాటు చేశారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారు. రూ.325 కోట్లతో మల్లన్నసాగర్ నుంచి తపాస్పల్లి రిజర్వాయర్కు కొత్తగా కాలువ నిర్మాణం పూర్తిచేశారు. మద్దూరు, ధూళిమిట్ట్ట మండలాల్లోని తండాలకు రూ.20 కోట్లతో బీటీరోడ్లు, చేర్యాల-నంగునూరు మార్గంలో రూ.3 కోట్లతో రోడ్డు నిర్మాణం పనులు, కొమురవెల్లి మల్లన్న ఆలయం నుంచి రాజీవ్ రహదారి వరకు డబుల్ రోడ్డు విస్తరణ, కొమురవెల్లి నుంచి కొండపోచమ్మ వరకు డబుల్ రోడ్డు నిర్మించారు. జనగామ మండలం చంపక్హిల్స్లో ఎంసీహెచ్ దవాఖాన, ధర్మకంచలో అంబేద్కర్ స్టేడియం, ఇండోర్ స్టేడియం నిర్మించారు. జనగామ, చేర్యాల వ్యవసాయ మార్కెట్లో వర్క్షెడ్లు నిర్మించారు. జనగామ మున్సిపాలిటీల రూ.50 కోట్లతో పట్టణ సుందరీకరణ, అభివృద్ధి పనులు, బతుకమ్మకుంట అభివృద్ధి, సుందరీకరణ చేపట్టారు. జనగామ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ, మున్సిపల్ కొత్త భవనం నిర్మాణం, సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మాణం, చౌరస్తా-నెహ్రుపార్కు ప్రధాన రోడ్డు విస్తరణ, జనగామకు జిల్లా కోర్టు ఏర్పాటు, ఏరియా దవాఖాన జిల్లా ప్రధాన వైద్యశాలగా అప్గ్రేడ్ చేశారు.
ఆరు దశాబ్దాల్లో జరగని అభివృద్ధి తొమ్మిదిన్నరేండ్లలోనే..
అరవై ఏండ్లలో జరగని అభివృద్ధిని జనగామ జిల్లాలో తొమ్మిదిన్నరేండ్లలోనే సీఎం కేసీఆర్ చేసి చూపించారు. రూ.7,500 కోట్ల అభివృద్ధి, సంక్షేమ పథకాలు జనగామ నియోజకవర్గానికి అందుతున్నాయి. జనగామ నియోజకవర్గంలో 59,678 ఎకరాల భూమి ఉంటే 2014కు ముందు 15 వేల ఎకరాలకు మించి వరి సాగైన దాఖలాలు లేవు. నేడు వందశాతం భూమి సాగులోకి వచ్చింది. దేవాదుల ఎత్తిపోతలతో ఒకనాడు తిండిగింజలకు దిక్కులేని ప్రాంతం నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధిక వరి పండించే ప్రాంతంగా ఖ్యాతి పొందింది. ‘ఫాస్ట్ మూవింగ్ సిటీగా’ జనగామ మున్సిపాలిటీ దేశంలోనే 3వ స్థానంలో నిలిచి కేంద్ర అవార్డును అందుకున్నది.