ఏడు రోజులపాటు నిర్వహణ
కాకతీయ వారసుడు కమల్చంద్ర రాక
చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ వెల్లడి
వరంగల్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను గురువారం నుంచి 13వ తేదీ వరకు ఏడుతరాలకు గుర్తుండేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ తెలిపారు. సప్తాహం కా ర్యక్రమ వివరాలను బుధవారం ఆయన హనుమకొండలో మీడియాకు వెల్లడించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాతోపాటు నల్లగొండ జిల్లా చందుపట్ల, నకిరేకల్, పానగల్లులోనూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మిషన్ కాకతీయపై వరంగల్ నిట్లో సదస్సు నిర్వహిస్తున్నామని చెప్పారు. 13వ తేదీన రామప్ప ఆలయం వద్ద కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శనలతో వేడుకలు ముగుస్తాయని వివరించారు. కాకతీయుల చరిత్రను భావితరాలకు అందించాలనే లక్ష్యంతోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు.
ఛత్తీస్గఢ్లోని బస్తర్లో ఉంటున్న కాకతీయుల 22వ వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ను ఈ వేడుకలకు ఆహ్వానించినట్టు పేర్కొన్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులు, శిథిలావస్థలో ఉన్న ఆలయాలను తెలంగాణ ప్రభుత్వం పునరుద్ధరించిందని పేర్కొన్నారు. కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భంజ్దేవ్ గురువారం ఉదయం ఏడున్నర గంటలకు హైదరాబాద్ నుంచి భద్రకాళీ ఆలయానికి వస్తారని చెప్పారు. వేడుకల్లో పాల్గొన్న అనంతరం హైదరాబాద్కు వెళ్లి మంత్రి కేటీఆర్తో కలిసి స్టేట్గ్యాలరీలో 777 ఫొటోలు, 777 పురాతన నాణాల ఎగ్జిబిషన్ను ప్రారంభించి పరిశీలిస్తారని తెలిపారు. తొలిరోజు నాటక ప్రదర్శన, కవి సమ్మేళనం, శాస్త్రీయ సంగీత కచేరీ, వడ్డేపల్లి బండ్పై వేడుకలు నిర్వహించనున్నట్టు చెప్పారు. సమావేశంలో మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.