కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి సూర్యాపేట జిల్లా వరకు సాగునీటిని తీసుకుపోయే కాకతీయ కాలువ నిండుగా పారుతున్నది. యాసంగి వరి నాట్లు జిల్లాలో చివరి దశకు చేరుకోగా, కొన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నీటి పారుదల అధికారులు ఈ సీజన్లోనే అత్యధిక నీటిని విడుదల చేశారు. ఇప్పుడు 5 వేల క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీ నుంచి కాలువకు విడుదల చేయడంతో కాలువ మొత్తం గట్టును ఆనుకొని పారుతున్నది. హనుమకొండ యాదవ నగర్ నుంచి పెద్దమ్మగడ్డ వరకు కాకతీయ కెనాల్ నిండుగా ప్రవహిస్తూ చూపరులకు కనువిందు చేస్తున్నది. కాలువలో నిండుగ నీరు వస్తుండటంతో పిల్ల కాలువలు కూడా సామర్థ్యం మేరకు నీటితో కళకళలాడుతున్నాయి. సూర్యాపేట జిల్లాలోని చివరి ఆయకట్టుకు కూడా సాగు నీరు అందుతున్నది. దీంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
– హనుమకొండ సబర్బన్