స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6, టీడీపీ 4, బీఆర్ఎస్ 4, సీపీఐ 1, ఇండిపెండెంట్ ఒకసారి చొప్పున గెలిచాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ ఆధిక్యతను కనబరుస్తున్నది. అన్ని వర్గాల ప్రజల మేలు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కండ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. తాజా ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి గెలుపు నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
నియోజకవర్గ కేంద్రంలో రూ.2.65 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది. ప్రతిభావంతులైన గ్రామీణ క్రీడాకారులకు ఇది ఎంతగానో ఉపయోగపడనున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పాలిటెక్నిక్ కళాశాలలు ఉండగా స్టేషన్ఘన్పూర్లో ఒకటి ఉన్నది. నియోజకవర్గ కేంద్రంలో మోడల్ స్కూల్, సాంఘిక సంక్షేమ, మైనారిటీ, గిరిజన సంక్షేమ గురుకులాలు, కస్తూర్బాగాంధీ, ప్రభుత్వ జూనియర్, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు మంజూరయ్యాయి. ఆయా కళాశాలల ఏర్పాటుతో స్టేషన్ఘన్పూర్ ఎడ్యుకేషన్ హబ్గా మారనున్నది. నియోజకవర్గ కేంద్రంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు సీఎం కేసీఆర్ రూ.37.50 కోట్లు మంజూరు చేశారు. ధర్మసాగర్ మండలం రాంపూర్, స్టేషన్ఘన్పూర్, రఘునాథపల్లి, జనగామ జాతీయ రహదారులపై ఫ్లై ఓవర్లు నిర్మించారు.
డబుల్ బెడ్రూం ఇండ్లు
స్టేషన్ఘన్పూర్ మండలం.. రాఘవాపూర్లో 40 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందజేశారు. కొత్తపల్లిలో 30 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. పల్లగుట్టలో 30 ఇండ్ల నిర్మాణం పూర్తయ్యి, పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. సముద్రాలలో 40, పాంనూర్లో 40 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నది. స్టేషన్ఘన్పూర్ మండలానికి 150, చిల్పూర్కు 30, జాఫర్గఢ్కు 50, తిమ్మంపేటకు 25 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి.
తుది దశకు 7 రిజర్వాయర్లు
నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్న 7 రిజర్వాయర్లలో 6 పనులు పూర్తి కాగా, జాఫర్గడ్ మండలం ఉప్పుగల్లులో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. నాలుగు విడుతల్లో రూ. 83.24కోట్లతో మిషన్ కాకతీయ ద్వారా 504 చెరువులు, కుంటలు, మత్తళ్లు, తూములకు మరమ్మతులు చేపట్టగా, 18,110 ఎకరాలు సాగులోకి వచ్చింది. దేవాదుల కాల్వల ద్వారా వీటిలో నీటిని నింపడంతో మండువేసవిలోనూ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి.
త్వరలో 5,600 ఎకరాలకు సాగునీరు
14 కిలోమీటర్ల మెయిన్ కెనాల్, 21 కిలోమీటర్ల కాల్వ పనులు కొనసాగుతున్నాయి. ఇవి పూర్తయితే స్టేషన్ఘన్పూర్తోపాటు పలు మండలాల్లోని 30 కుంటలు, చెరువుల్లో నీటిని నింపడం ద్వారా 5,600 ఎకరాలకు సాగునీరు అందనున్నది. ధర్మసాగర్, చిల్పూర్ మండలాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రదేశాలకు సాగు నీరు అందించేందుకు మల్లన్నగండి, నష్కల్ రిజర్వాయర్లపై ఎత్తిపోతల కోసం సీఎం కేసీఆర్ రూ.104 కోట్లు మంజూరు చేశారు.
…? చిలగాని విజయకుమార్