స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 4: ఆనాడు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న పార్టీలు, శక్తులు, వ్యక్తులు, సంస్థలు నేడు తెలంగాణపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల పోరాటాలు, అమరుల త్యాగాల ఫలితం, కేసీఆర్ నాయకత్వంతో రాష్ర్టాన్ని సాధించుకున్నామని గుర్తుచేశారు. ఎనిమిదేండ్ల నుంచి తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించి, దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
కేసీఆర్, టీఆర్ఎస్ ద్వారా మాత్రమే రాష్ట్ర హక్కులు పదిలంగా ఉంటాయని చెప్పారు. ఎవరో వదిలిన బాణం.. తెలంగాణపై దాడి చేయడమే కాకుండా, విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వారిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. బీజేపీ అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నదని దుయ్యబట్టారు. ఆ పార్టీలో చేరని వారిపై ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నదని ఆరోపించారు.
వైఎస్ రాజశేఖర్రెడ్డి, జగన్, షర్మిల ముమ్మాటికీ తెలంగాణ ద్రోహులేనని అన్నారు. షర్మిలకు రాజకీయ అవగాహన ఉంటే వెళ్లి ఆంధ్రాలో పాదయాత్ర చేసుకో, లేదా మీ అన్న అవినీతిపై , అప్రజాస్వామిక పాలనపై ప్రజల్లోకి వెళ్తే ఆదరిస్తారు కావచ్చన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన లక్ష్మీపార్వతికి వచ్చిన గతే తెలంగాణలో షర్మిలకు పడుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని తెలంగాణ సమాజం, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందన్నారు.