హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించవద్దని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని మరోమారు డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని అసెంబ్లీ జీరో అవర్లో మరోసారి ఆయన ప్రస్తావించారు. ధర్మసాగర్ మండలంలోని ఎల్కుర్తికి మంజూరైన సైనిక్ స్కూల్ను సికింద్రాబాద్ కంటోన్మెంట్కు తరలించవద్దని కడియం సూచించారు. ఈ సైనిక్ స్కూల్ ఏర్పాటుకు 2017లోనే కేంద్రంతో ఒప్పందం చేసుకున్నామని, 49.32 ఎకరాలకు భూసేకరణ సీసీఎల్ఏ పరిశీలనలో ఉందని చెప్పారు. ఇటీవలే కేంద్రం కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను మంజూరు చేసిందని, కేంద్రంతో కొట్లాడి రెండు నుంచి మూడు సైనిక్ స్కూళ్లను తెలంగాణకు తేవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇక మడికొండ, రాంపూర్, ధర్మసాగర్ మధ్య గల డంపింగ్యార్డ్ను మడిపల్లి జయగిరి ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ జీరో అవర్లో భాగంగా పలువురు ప్రస్తావించిన అంశాలపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమాధానాలిచ్చారు. మూసి, మానేరు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పనులను కొనసాగించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. ఈ రెండిండికీ టెండర్లు పూర్తయ్యాయని, బడ్టెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గొల్లకురుమలకు గొర్రెలిచ్చేందుకు వడ్డీతో సహా డీడీలు కట్టించుకున్నారని, దీనిపై ప్రభు త్వం నుంచి స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నిలదీశారు. ప్రభుత్వం సహాయం చేయకపోయినా ఫర్వాలేదు.. కానీ విచారణ జరపుతామనడంతో అంతటా ఆందోళన నెలకొన్నదని, ప్రభుత్వం వెంటనే వడ్డీతో సహా ఆయా డబ్బులను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచినా అన్ని రోగాలు కవర్ కావడం లేదని అన్ని వ్యా ధులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
కొండగట్టు, నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. తన నియోజకవర్గంలో లెదర్ పార్క్, వరద కాల్వపై తూములు, నారాయణపూర్ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల నిర్మాణం చేపట్టాలని విన్నవించారు. మిడ్మానేర్ భూనిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గంగాధరకు డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలని కోరారు.
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పెండింగ్ పనులను పూర్తిచేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. ఇప్పటికీ రూ.178 కోట్లు మంజూరు చేశారని, మరో రూ.40 కోట్లు మంజూరుచేసి పనులను పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమనగల్లులో 50 పడకల దవాఖానను ఏర్పాటు చేయాలని ప్రస్తావించారు.
సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ వేతనాలివ్వాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రభుత్వాన్ని కోరారు. కార్మికులు ప్రమాదాల బారినపడి మృత్యువాత పడుతున్నారని, చనిపోయినా నష్టపరిహారం ఇవ్వడంలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు.
రాజన్న జోన్లో ఉన్న మెదక్ జిల్లాను చార్మినార్ జోన్లో కలపాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. హల్దివాగుపై గల 20-30 చెక్డ్యామ్లను కొండపోచమ్మ సాగర్ నీళ్లతో నింపాలని కోరారు.
చెన్నూరు నియోజకవర్గంలో పత్తిని కొనుగోలు చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే జీ వివేకానంద్ ప్రభుత్వాన్ని కోరారు. పత్తి కొనుగోలు చేయకపోవంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రస్తావించారు. నియోజకవర్గంలో 100 బోరుబావుల తవ్వకానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి కోరారు. చిలుకవాగు బ్రిడ్జి, కల్వల ప్రాజ్టెలు, చెక్డ్యామ్లను పునర్నిర్మించాని విన్నవించారు. వావిలాల, శనిగరం, చల్లూరు, ఉప్పల్లో కొత్త మండలాలు ఏర్పా టు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లోని పలు సమస్యలను పరిష్కరించాలని ఎంఐఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీ జీరో అవర్లో ప్రస్తావించారు. తన నియోజకవర్గంలోని బస్తీలకు ఆర్టీసీ బస్సులు రావడంలేదని, మినీ బస్సులు నడపాలని బహద్దూర్పుర ఎమ్మెల్యే మమ్మద్ ముబీన్ ప్రభుత్వాన్ని కోరారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించాలని మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ బలాల కోరారు. నర్సులను జోన్ వారీగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. గోల్కొండ, కార్వాన్, జియాగూడల్లో నల్లా నీళ్లు కలుషితమవుతున్నాయని, సెక్షన్ మేనేజర్లు పట్టించుకోవడంలేదని సభ దృష్టికి తీసుకొచ్చారు. నాలా ల్లో పూడికను తొలగించాలని యాకుత్పుర ఎమ్మెల్యే కౌసర్ మోయినొద్దీన్ కోరారు.
పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీరో అవర్లో మాట్లాడారు. తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తెచ్చారు. తాండూరులో కంది బోర్డును ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. తాండూరు కందిపప్పుకు జియోట్యాగింగ్ వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. కోట్పల్లి, జుట్టుపల్లి ప్రాజెక్ట్లకు నిధులివ్వాలని కోరారు. డోర్నకల్లో మిర్చి బోర్డు ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే జాటోత్ రామచందర్ నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. ఒకే నెలలో 28 మంది గిరిజన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతులను ఆదుకోవాలని ప్రస్తావించారు. మైదాన ప్రాంత ఐటీడీఏ ఏర్పాటుచేయాలని, కోతుల బెదడ నివారణకు చర్యలు చేపట్టాలని, ఎస్ఎస్ఏ కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరారు. దేవరకద్రలోని చిన్న చింతకుంటలో జూనియర్ కాలేజీ, నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీ మంజూరు చేయాలని, దేవరకద్రలో 100 పడకల, కొత్తకోటకు 50 పడకల దవాఖానలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి కోరారు. పట్టాలిచ్చిన పోడు భూముల్లో బోరుబావులు తవ్వుకునేందుకు అనుమతించాలని ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి కోరారు. బెల్లంపల్లి నియోజకవర్గానికి తాగు, సాగునీటిని అందించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ విజ్ఞప్తి చేశారు. పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వాలని ఎమ్మెల్యే మధన్మోహన్రావు కోరారు.
బంజారాల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ ఆలయాన్ని ప్రభుత్వం నిర్మించనున్నదని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అసెంబ్లీ జీరో అవర్లో సభకు తెలిపారు.
మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను ప్రొటోకాల్ విషయంలో అనేక అవమానాలు ఎదుర్కొంటున్నానని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీకారం తీర్చుకోవడం, పగ పట్టడం సరికాదని అధికారులు సమయం, గౌరవం ఇవ్వడం లేదని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. కొత్త పెట్టుబడులను హైదరాబాద్ చుట్టూ కాకుండా ఉమ్మడి జిల్లాల్లో 20 శాతం చొప్పున ఉమ్మడి జిల్లాల్లో పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సూచించారు. కొడంగల్లో రూ.100 కోట్లతో మాడల్ గురుకులాన్ని ఏర్పాటుచేసినట్టే ఆర్మూరులోనూ ఏర్పాటు చేయాలని కోరారు.
తన నియోజకవర్గంలోని చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సీటీస్కాన్, ఎంఆర్ఐ పరికరాలు, సిబ్బందిని నియమించాలని కోరారు. లద్నూరు తపాస్పల్లి రిజర్వాయర్ నుంచి నియోజవర్గానికి నీళ్లివ్వాలని, చెరువులను దేవాదుల నీళ్లతో నింపాలని, వేరుశనగ రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులే అన్ని వర్క్లిస్తరని ప్రచారం జరుగుతున్నదని.. ఇదేం విధానమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అసెంబ్లీలో ప్రశ్నించారు. జీవో 111 తొలగింపుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈసీ, మూసి నదులపై బ్రిడ్జిలు నిర్మించాలని ప్రస్తావించారు.
నాచారం, కాప్రా, రామంతాపూర్ చెరువుల్లో గుర్రపు డెక్కను తొలగించకపోవడంతో దోమల బెడద తీవ్రమవుతున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఉప్పల్కు మంజూరైన 100 పడకల దవాఖానను ప్రారంభించాలని కోరారు. ఉప్పల్-నారపల్లి ఫైఓవర్, రోడ్లను త్వరగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు.