హనుమకొండ, ఏప్రిల్ 16 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టింది ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. తెలంగాణ విద్రోహ యాత్ర అని, ఈ యాత్రతో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. శనివారం ఆయన హనుమకొండలోని తన నివాసంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవాలని కేంద్రం చూస్తున్నదన్నారు. దేశవ్యాప్తంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణకు వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి ఓర్వలేక బండి సంజయ్ ఈ యాత్రను చేపట్టినట్టు భావిస్తున్నామని చెప్పారు.
తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చావ్? అభివృద్ధికి సహకరించిన విధానం ఏమిటి? సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చిన చేయూత ఏమిటో? ప్రజలకు వివరించి పాదయాత్ర చేస్తే బాగుండేదని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోవడాన్ని చూసి నరేంద్రమోదీ సర్కారు ఓర్వలేకపోతున్నదన్నారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేయాలని, రైతును రాజు చేయాలనే విధానంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుంటే జీర్ణించుకోలేక పోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించి కేంద్రంలోని బీజేపీ సర్కారు విధానాలను ఎండగడుతారనే భయంతో మోదీ ఆదేశాల మేరకు బండి పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు.
విభజన చట్టంలోని ఏ ఒక్క హామీనైనా అమలుచేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి వరంగల్ జిల్లావాసుల చిరకాల కోరిక కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ తెచ్చారా? ములుగు గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారా? కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇప్పించారా? అభివృద్ధికి ఏమైనా నిధులు తెచ్చారా? చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవేవీ చేయకుండా పాదయాత్ర ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇతర రాష్ర్టాలతోపాటు, ఏపీలోని అనంతపురంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేసి ములుగులో ఎందుకు ప్రారంభించలేదో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీలు ఏ విషయంలోనూ కేంద్రాన్ని ఒప్పించి, మెప్పించలేని చేతగాని, చేవలేని సన్నాసులు, దద్దమ్మలని కడియం మండిపడ్డారు.
దేశ ప్రజలు కేసీఆర్నే కోరుకుంటున్నరు: దాస్యం
దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని చెప్పే అధికారం బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులకు ఎక్కడిదని ప్రశ్నించారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు కుట్రలు కుతంత్రాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.