Congress | న్యూస్నెట్వర్క్, మార్చి 30 (నమస్తేతెలంగాణ): బీఆర్ఎస్ స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్లోకి తీసుకోవద్దని ఆ పార్టీ వివిధ మండలాల అధ్యక్షులు అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో శనివారం వారు మీడియా సమావేశాలు నిర్వహించి.. కడియం శ్రీహరి కాంగ్రెస్లోకి రావడంపై అభ్యంతరం తెలిపారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల అధ్యక్షుడు గుర్రపు ప్రసాద్ మాట్లాడుతూ.. కడియం గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేశారని, తెలంగాణలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని శాపనార్థాలు పెట్టి ఇప్పుడు పార్టీలోకి వస్తే స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రమాదంలో పడ్డట్లేనని పేర్కొన్నారు. వరంగల్ పార్లమెంట్ టికెట్ తన కూతురు కావ్యకు ఇప్పించి అసలైన కాంగ్రెస్ నాయకులకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.
కడియం శ్రీహరి ఒక దళిత ద్రోహి అని, స్టేషన్ఘన్పూర్ కార్యకర్తలకు అండగా ఉంటున్న సింగాపురం ఇందిరకు వరంగల్ ఎంపీ టికెట్ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు. వెన్నుపోటు రాజకీయాలు కడియం శ్రీహరికి వెన్నతోపెట్టిన విద్య అని, అధికార దాహంతోనే ఆయన పార్టీ మారుతున్నారని కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా నాయకుడు కీసర దిలీప్రెడ్డి విమర్శించారు. జనగామ జిల్లా రఘునాథపల్లిలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు లింగాల జగదీశ్ చంద్రరెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కడియం శ్రీహరికి డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిందని, ఆయన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చిందని, అయినా.. తన స్వార్థం కోసం బీఆర్ఎస్ను వీడుతున్నారని మండిపడ్డారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని సూచించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కాంగ్రెస్లో చేర్చుకునే విషయంలో అధిష్ఠానం పునరాలోచన చేయాలని జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి సూచించారు. కాంగ్రెస్ పార్టీకి తన జీవితంలో ఓటు వేయలేదన్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. ఇప్పుడు అదే పార్టీలో చేరేందుకు సిద్ధమవ్వడం సిగ్గుమాలిన పని అని ఆ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిది ఎడ్ల వెంకటయ్య, సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జి రడపాక రాజ్కుమార్, సాగరం ఎంపీటీసీ రజిత, కాంగ్రెస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు చిట్టిమల్ల కృష్ణమూర్తి, మండల అధికార ప్రతినిధి ముక్తార్ అలీ విమర్శించారు. తన స్వార్థం, సంపాదన కోసమే శ్రీహరి కాంగ్రెస్లో చేరుతున్నారని దుయ్యబట్టారు. కడియంను కాంగ్రెస్లోకి రానీయొద్దని చిల్పూరు మండల కాంగ్రెస్ ఇన్చార్జి తీగల మహేందర్ పేర్కొన్నారు.