నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణకే కట్టడి చేయాలనే కుట్రలతో తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకోవడం, దాచుకోవడమే బీజేపీ విధానమని, అందుకే రాబోయే రోజుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని చెప్పారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశ రాజకీయాల్లో ఉంటే అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి మోదీ సర్కార్ను గద్దె దింపుతారని అన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా పీఏపల్లి, నల్లగొండ మండలాల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తులకు రూ.12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన ప్రధాని మోదీ సర్కార్.. పేదలకు ఉపయోగపడే ఒక్క పథకం కూడా అమలు చేయలేదని విమర్శించారు. పేదలను పట్టించుకోక, పేదలకు ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేసేలా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఉచిత కరెంటు, పెన్షన్లు, రైతుబంధు లాంటి పథకాలను అడ్డుకునేలా ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్న కేసీఆర్ సర్కార్ను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడంతోపాటు వివక్ష చూపుతూ నిర్లక్ష్యం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, కంచర్ల భూపాల్రెడ్డి పాల్గొన్నారు.