Kadem Project | నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు తప్పింది. ప్రాజెక్టుకు వరద తగ్గడంతో ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఉదయం ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కులకుపైగా వరద రాగా.. ఉదయం ఆనకట్టపై నుంచి వరద ప్రవహించింది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టులోకి 1.30లక్షల క్యూసెక్కులకు వరద తగ్గింది.
16 గేట్లు ద్వారా అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయం నాలుగు గేట్లు మొరాయించగా.. రెండుగేట్లను ఇంజినీర్లు ఎత్తారు. కడెం ప్రాజెక్టు ప్రస్తుతం ఔట్ ఫ్లో 2.30లక్షల క్యూసెక్కులుగా ఉన్నది. ఇదిలా ఉండగా.. భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి సైతం వరద తగ్గుతున్నది. ప్రాజెక్టు ఐదుగేట్లు ఎత్తి 92,482 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 73,792 క్యూసెక్కుల ప్రవాహం తగ్గుతున్నది.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద భారీగా పెరుగుతున్నది. ప్రాజెక్టులోకి కొనసాగుతున్న 2,92,889 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి 2.5లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 4వేల క్యూసెక్కులను ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి విడుదలవుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 1088.7 అడుగులుగా ఉన్నది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రాజెక్టులోకి ప్రస్తుత నీటిమట్టం 78.66 టీఎంసీలుగా ఉండగా.. పూర్తి స్థాయినీటి మట్టం 90 టీఎంసీలు.