రాజ్భవన్లో 10.05 గంటలకు ప్రమాణం చేయించనున్న గవర్నర్
హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మంగళవారం ప్రమాణం చేయనున్నారు. రాజ్భవన్లో ఉదయం 10.05 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయిస్తారు. 2019 జనవరి 1న తెలంగాణ హైకోర్టు ఏర్పాటు తర్వాత జస్టిస్ భూయాన్ ఐదో సీజే అవుతారు. ఇప్పటివరకు సీజేగా ఉన్న జస్టిస్ సతీశ్చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టు సీజేగా బదిలీ అయ్యారు.
1964 ఆగస్టు 2న అసోంలోని గౌహతిలో జస్టిస్ భూయాన్ జన్మించారు. 1991లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2010 సెప్టెంబర్ 6న సీనియర్ న్యాయవాదిగా పదోన్నతి లభించింది. 2011 జూలై 21న అసోం ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్గా, 2011 అక్టోబర్ 17న గౌహతి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తి అయ్యారు. 2019 అక్టోబర్ 3న బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా సమర్థతను చాటారు.