నాగర్కర్నూల్, జనవరి 8: రాష్ట్రంలో సత్వర న్యాయం అందించేందుకు కోర్టుల్లో మౌలిక సదుపాయాలు అవసరమని హైకోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి పేర్కొన్నారు. నాగర్కర్నూల్ జిల్లాకేంద్రంలో రూ.4.95 కోట్లతో నిర్మించిన రెండు కోర్టు భవనాలను హైకోర్టు జడ్జిలు వెంకటేశ్వర్రెడ్డి, మాధవీదేవి, మహబూబ్నగర్ ప్రిన్సిపల్ సెషన్కోర్టు జడ్జి ప్రేమావతి, కలెక్టర్ ఉదయ్కుమార్తో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. అనంతరం జస్టిస్ శ్రీదేవి మాట్లాడుతూ.. తాము ప్రాక్టీస్ చేసే రోజుల్లో సరైన సదుపాయాలు ఉండేవి కావని గుర్తుచేశారు. ఆర్టికల్ 39 (ఏ) ప్రకారం ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం పొందే హక్కు ఉన్నదని.. అది నెరవేర్చడానికి న్యాయమూర్తులు, లాయర్లు కృషి చేయాలని కోరారు. అనంతరం కోర్టు ఆవరణలో ఆమె మొక్కలు నాటారు.