కమలాపూర్, ఆగస్టు 28 : నాడు రిజర్వేషన్లు తీసుకొచ్చి దళితులకు అంబేద్కర్ న్యాయంచేస్తే, నేడు సామాజిక వివక్ష పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తెచ్చారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. వీరిద్దరు తప్ప దళితుల కోసం ఎవరూ ఏమీ చేయలేదని, అందుకే దళితుల ఇండ్లలో వారి ఫొటోలే ఉండాలని చెప్పారు. శనివారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని అంబా ల, శనిగరం గ్రామాల్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి దళితకాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్లు ఇస్తున్నదన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సంక్షేమ పథకాల అమలును ఆపడం లేదన్నారు. ఓట్ల కోసం వచ్చే బీజేపీ నాయకులను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఏడేండ్లలో కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం పార్టీ దళితుల కోసం ఏంచేసిందో నిలదీయాలని సూచించారు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి గ్రామంలో లక్ష రూపాయల పని చేసిండా..? రేపు ఈటల గెలిచినా ఏం చేయడన్నారు. అధికారంలో ఉండేది టీఆర్ఎస్ పార్టీ అని, పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలువాలన్నారు. ఈటలకు ఓటేస్తే ఇంటికి వెళ్లి చేతులు కట్టుకోవాలని, గెల్లు శ్రీనివాస్కు ఓటేస్తే మీ ఇంటికే వచ్చి నిలబడుతాడని చెప్పారు. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారీటీ గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, డాక్టర్ పేరియాల రవీందర్రావు, జెడ్పీటీసీ కల్యాణి, పెండ్యాల రవీందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.