నల్లగొండ : నాగార్జునసాగర్(Nagarjuna sagar) ఎడమ కాలువ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను(Crops) కాపాడాలని మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి(Julakanti Rangareddy) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఎడమ కాలువ సూరేపల్లి మేజర్ వద్ద జాతీయ రహదారిపై తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. చెరువులను బోర్లను నమ్ముకొని ఎడమ కాల్వ కింద రైతులు 30 శాతం మంది వరి పంటలు వేశారన్నారు. నేడు అవి ఎండిపోయే దశలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగర్ ఎడమ కాలువ ద్వారా తాగునీటి కోసం, సాగునీటి కోసం నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని, ఎండిపోతున్న పంటను కాపాడి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన కోరారు.
ప్రాజెక్టులో నీళ్లు లేకపోతే ప్రాజెక్టు పైన ఉన్న ఆల్మట్టి నుంచి కర్ణాటక ప్రభుత్వం సంప్రదించి రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, కూన్ రెడ్డి నాగిరెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, కందుకూరు కోటేష్, కోమండ్ల గురువయ్య, నలబోతు సోమయ్య, తదితరులు పాల్గొన్నారు