నల్లగొండ : సెంటిమెంట్ పేరుతో బీజేపీ(BJP) రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తుందని, పార్లమెంటు ఎన్నికల వేళ అయోధ్యలోని రామమందిరాన్ని తెరపైకి తీసుకొచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి(Julakanti Rangareddy) విమర్శించారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని దొడ్డి కోమరయ్య భవనంలో పార్టీ జిల్లా విస్తృత సాయి సమావేశం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి మూడోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.
అందులో భాగంగానే అయోధ్యలోని రామ మందిరాన్ని ముందుకు తెచ్చి దేశవ్యాప్తంగా క్యాoపియన్ చేస్తూ ప్రజలను సెంటిమెంట్తో మోసం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, అతని సొంత ఎజెండా అమలవుతుందని చెప్పారు. ఒకే దేశం, ఒకే మతం, ఒకే బాష, ఒకే ఆహారం లాంటి విధానాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని గుర్తు చేశారు. ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న బీజేపీని గద్దె దించేందుకు ఇండియా కూటమి ఏర్పడిందని, బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు.