నల్లగొండ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్ధానంలో భాగంగా ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా రైతులందర్నీ రుణవిముక్తులను(Loan waiver) చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి(Julakanti Rangareddy )రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేటు ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని, ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తొలుత ప్రతి రైతుకూ రూ.2లక్షలు అని చెప్పిన ప్రభుత్వం తర్వాత రైతు కుటుంబానికి అని మాట మార్చిందని, అది కూడా అందరికీ మాఫీ చేయడం లేదని విమర్శించారు.
ఇప్పటి వరకు రూ.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లకు పైగా జమ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఏక కాలంలో రూ.2 లక్షలు మాఫీ చేస్తామని ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు. రుణమాఫీ 40శాతం కూడా పూర్తి చేయలేదన్నారు. రైతులు బ్యాంకులు, వ్యవసాయాధికారుల చుట్టు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్ధానం ప్రకారం రుణం తీసుకున్న ప్రతిరైతుకు రుణమాఫీ వర్తింపచేయాలన్నారు. గత ప్రభుత్వం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తే తగిన సమయంలో రైతులు ప్రభుత్వానికి బుద్దిచెబుతారని హెచ్చరించారు.