బాన్సువాడ (జుక్కల్), ఆగస్టు 5: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుకు తీవ్ర పరాభవం ఎదురైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని యువకులు నిలదీయటంతో బిత్తరపోవడం ఆయన వంతైంది. వారికి సమాధానం చెప్పలేని ఎమ్మెల్యే సహనం కోల్పోయి తమాషాలు చేస్తున్నారా? అని యువకులపై చెలరేగిపోయారు. దీంతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అసలేం జరిగిందంటే.. కామారెడ్డి జిల్లా జుక్కల్లో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, కలెక్టర్ సోమవారం వచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని స్థానిక యువకులు లక్ష్మీకాంతారావు కారుకు అడ్డంగా నిలుచున్నారు. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దారుణంగా ఉన్నదని, కనీసం నడవలేని పరిస్థితి ఉన్నదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చి 9 నెలలవుతున్నా చిన్న సమస్య కూడా పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలు సమస్యలను దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండగా ఎమ్మెల్యే సహనం కోల్పోయి.. తమాషాలు చేస్తున్నారా? అంటూ బెదిరించారు. రోడ్లు బాగా లేవని అడిగితే, తమాషాలా! అంటూ ఎవరిని అంటున్నారని యువకులు నిలదీశారు. ఏమైనా సమస్యలు ఉంటే క్యాంప్ కార్యాలయానికి వచ్చి మాట్లాడాలని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేయగా.. యువకులు మరింత గట్టిగా నిలదీయటంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.