Jukkal | రాష్ట్రానికి సరిహద్దున ఉండే జుక్కల్ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పాలకులకు కనిపించలేదు. ఇక్కడి ప్రజల కష్టాలు వాళ్లకు ఎన్నడూ పట్టలేదు. ఫలితంగా 2014లో కేసీఆర్ పాలన వచ్చే వరకు జుక్కల్ అభివృద్ధికి నోచుకోలేదు. కాంగ్రెస్ పాలకులు ఇక్కడి ప్రజల దాహార్తిని తీర్చేందుకు సరిపడా మంచినీటిని కూడా సరఫరా చేయలేదు . చెలిమెలు తోడి నీళ్లు తాగాల్సిన దయనీయ పరిస్థితులు ఇక్కడ ఉండేవి. నిజాంసాగర్ ప్రాజెక్టు వట్టిపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వ విద్య, వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చాకే జుక్కల్లో అభివృద్ధి మొదలయ్యింది. సాగు, తాగునీరు అందుతున్నది. మౌలిక వసతులు మెరుగయ్యాయి. సర్కారు వైద్యం చేరువయ్యింది.
దశాబ్దాల పాటు రాష్ర్టాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ జుక్కల్ నియోజకవర్గానికి తీరని అన్యాయాన్ని చేసింది. ఈ సరిహద్దు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకుండా ఆగం పట్టించింది. వెనుకబాటుకు కారణమయ్యింది. కాంగ్రెస్ పాలనలో జుక్కల్ ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు వర్ణనాతీతం. తలాపున నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్నప్పటికీ ఇక్కడి రైతులకు మాత్రం ప్రయోజనం కలుగలేదు. నాలుగుసార్లు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సౌదాగర్ గంగారాం ఎన్నడూ రైతుల వెతలు పట్టించుకోలేదు. కనీసం రోడ్ల సౌకర్యాన్ని కల్పించలేదు. 2014లో కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక, హన్మంత్ షిండే ఎమ్మెల్యే అయ్యాక జుక్కల్లో అభివృద్ధి మొదలయ్యింది. గత పదేండ్లలో జుక్కల్ రూపురేఖలే మారిపోయాయి. అరవై ఏండ్ల పాటు ఇక్కడి ప్రజలు పడ్డ కష్టాలు తీరుతున్నాయి.
మెరుగైన విద్య, వైద్యం
గతంలో జుక్కల్ ప్రజలకు సరైన వైద్యం కూడా అందేది కాదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే దిక్కయ్యేది. ఎమ్మెల్యే హన్మంత్ షిండే బిచ్కుందలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో 30 పడకల దవాఖాన ఏర్పాటు చేయించారు. పిట్లం, బిచ్కుందలో 100 పడకల దవాఖానల నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. బిచ్కుందలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయించారు. గ్రామాల్లోనే ప్రజలకు వైద్యసేవలు అందించేలా పల్లె దవాఖానలను ప్రారంభించారు. నిజాంసాగర్ మండలంలో జూనియర్ కళాశాల, బిచ్కుందలో డిగ్రీ కళాశాలతో పాటు ప్రతి మండలంలో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయించారు. గురుకుల, మాడల్ పాఠశాలలు, కస్తుర్బా పాఠశాలలకు నూతన భవనాలు నిర్మింపజేశారు. మన ఊరు మన బడి పథకం కింద పాఠశాలల్లో తరగతి గదులు, మౌలిక వసతులు కల్పించడంతో నియోజకవర్గంలో విద్యావ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి.
రెండు పంటలకు సాగునీరు
నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికీ సాగునీటిని అందించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. రూ.436 కోట్ల వ్యయంతో 40 వేల ఎకరాలకు సాగునీరు అందించేలా నిజాంసాగర్ మండలంలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో నాగమడుగు మత్తడిని నిర్మిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే నిజాంసాగర్, పిట్లం, పెద్దకొడప్గల్, బిచ్కుంద, మండలాల్లో సాగునీటి ఇబ్బందులు దూరమవుతాయి. కాళేశ్వరం నీటిని నిజాంసాగర్కు మళ్లించడం వల్ల నిజాంసాగర్ ఆయకట్టు కింద రెండు పంటలకు సాగునీరు అందుతున్నది. రైతువేదికలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సంక్షేమంలో టాప్
గతంలో జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలను ప్రభుత్వం ఎనిమిది మండలాలుగా మార్చి పాలనను ప్రజలకు చేరువ చేసింది. ఇంతవరకు సరైన రోడ్డు సదుపాయం లేని 120 గ్రామాలకు బీటీ రోడ్లు వేయించారు. నిజాంసాగర్ మండలాన్ని దళితబంధు పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి మొదటి విడతలో 1,298 దళిత కుటుంబాలకు, రెండో విడతలో మరో 277 కుటుంబాలకు పది లక్షలు అందించారు. దీంతో లబ్ధిదారులు ఆర్థికంగా బలోపేతమయ్యారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందజేస్తున్నారు.