హైదరాబాద్, అక్టోబర్ 17(నమస్తే తెలంగాణ): ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తన అరెస్టు, రిమాండ్ను సవాల్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. గత విచారణకు కొనసాగింపుగా సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మంగళవారం కూడా వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. ఈలోగా బాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. ఈ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందా లేదా అన్న దానిపై ముకుల్ రోహత్గీ, హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్ని, ఐపీసీ, సీఆర్పీసీలను ఉదహరించారు. అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించింది.