Jubilee Hills | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. ఉప ఎన్నికల్లో పోటీకి చివరిరోజులు పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 150కిపైగా నామినేషన్లు దాఖలవగా.. అభ్యర్థుల సంఖ్య 100 మార్క్ని దాటింది. మూడు గంటల తర్వాత గేటు లోపల ఉన్న వారికి మాత్రమే అధికారులు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్స్ వేశారు. ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు, ఓయూ నిరుద్యోగ వికాస నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ల చివరిరోజున బీజేపీ తరఫున లంకల దీపక్రెడ్డి సైతం ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ నామినేషన్లు వేశారు. రేపటి నుంచి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి సాయిరాం పరిశీలించనున్నారు. ఇక 24న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుండగా.. 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.