Minister Errabelli | సీఎం కేసీఆర్ మాట తప్పని.. మడమ తిప్పని నాయకుడు అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. ఆయన మనసున్న మహారాజు అని అన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజ్ ప్రక్రియ చేపట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. వరంగల్లోని మంత్రి క్యాంప్ కార్యాలయ ఆవరణలో జేపీఎస్లతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
తమ క్రమబద్ధీకరణపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం పట్ల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎర్రబెల్లి దయాకర్రావును కలిసిన పలువురు జేపీఎస్లు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యలరైజ్ చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు వేశారని తెలిపారు. ఆ కమిటీల నివేదికలు రాగానే రెగ్యులరైజ్ చేస్తామన్నారు.
కాగా, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించినందుకు మంత్రి ఎర్రబెల్లిని కలిసి ఆ విభాగం ఇంజనీరింగ్ అధికారులు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిని సన్మానించి తమ కృతజ్ఞతలు చాటుకున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని ఈ సందర్భంగా వారికి మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమర్థవంతమైన సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు.